ఎడారిలో 'తీపి' సంతకం.. నవ్వుకున్న నోళ్లే మెచ్చుకుంటున్నాయి.. ప్రధాని మెచ్చిన సక్సెస్ స్టోరీ!

ఎడారిలో తీపి సంతకం.. నవ్వుకున్న నోళ్లే మెచ్చుకుంటున్నాయి.. ప్రధాని మెచ్చిన సక్సెస్ స్టోరీ!
x

ఎడారిలో 'తీపి' సంతకం.. నవ్వుకున్న నోళ్లే మెచ్చుకుంటున్నాయి.. ప్రధాని మెచ్చిన సక్సెస్ స్టోరీ!

Highlights

వ్యాపారమేదైనా.. ఆలోచన కొత్తగా ఉంటే విజయం మీ వెంటే నడుస్తుందని నిరూపిస్తున్నాడు పన్నా రామ్ చౌదరి. ఒకప్పుడు "సజ్జలతో లడ్డూలా?" అని ఎగతాళి చేసిన నోళ్లే నేడు అబ్బురపడేలా చేస్తున్నాడు.

వ్యాపారమేదైనా.. ఆలోచన కొత్తగా ఉంటే విజయం మీ వెంటే నడుస్తుందని నిరూపిస్తున్నాడు పన్నా రామ్ చౌదరి. ఒకప్పుడు "సజ్జలతో లడ్డూలా?" అని ఎగతాళి చేసిన నోళ్లే నేడు అబ్బురపడేలా చేస్తున్నాడు. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని ఒక కుగ్రామం నుంచి మొదలైన ఈ ప్రస్థానం నేడు ఖండంతరాలు దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మెచ్చిన ఈ ‘మిల్లెట్ లడ్డు’ కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. చదవండి..

పరిహాసం నుంచి ప్రశంసల దాకా..

రాజస్థాన్ సరిహద్దు జిల్లా బార్మర్‌లోని ఖాదిన్ గ్రామానికి చెందిన రైతు పన్నా రామ్ చౌదరి. తన పొలంలో పండించే చిరుధాన్యాలను అలాగే అమ్మితే తక్కువ ధర వస్తుంది, అదే వాటిని రుచికరమైన వంటకాలుగా మార్చి అమ్మితే ఎక్కువ లాభం వస్తుందని ఆయన ఆలోచించారు. తన ఆలోచనను మరింత ముందుకు తీసుకెళ్లి 'రాంసర్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ లిమిటెడ్' అనే కంపెనీని ప్రారంభించి, మిల్లెట్ లడ్డూల తయారీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో గ్రామస్థులు "ఇది అయ్యే పనేనా?" అని నవ్వుకున్నా, పన్నా రామ్ మాత్రం వెనకడుగు వేయడానికి ఇష్టపడలేదు.

ఆయన స్టార్ట్ చేసిన ఈ లడ్డూలు కేవలం రుచికరమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ లడ్డులను స్వచ్ఛమైన నెయ్యి, బెల్లం, జీడిపప్పు, బాదం, ఏలకులు, నల్ల మిరియాలు, గులాబీ రేకులతో తయారు చేస్తారు. దీని ప్రత్యేకతలు ఏంటంటే.. వీటిలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా, పక్కా పరిశుభ్రతతో తయారు చేయడం వల్ల ఈ లడ్డూలు మూడు నెలల వరకు తాజాగా ఉంటాయి. దీని ధర విషయానికి వస్తే.. కిలో రూ. 600 నుంచి రూ. 800 వరకు పలుకుతోంది.

మోదీ 'మన్ కీ బాత్'లో మన రైతు ప్రస్తావన..

పన్నా రామ్ కృషికి అత్యున్నత గుర్తింపు దక్కింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' ప్రసంగంలో ఈ లడ్డూల గురించి ప్రస్తావించడంతో వీటి పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. నేడు జైపూర్, ఢిల్లీ, చెన్నై వంటి మహానగరాలే కాకుండా.. విదేశాల నుంచి కూడా ఈ లడ్డులకు ఆర్డర్లు వస్తున్నాయని పన్నా రామ్ గర్వంగా చెబుతున్నారు. ఇప్పుడు ఇది ఒక ఎడారి డెజర్ట్‌గా (Desert's Dessert) గుర్తింపు పొందిందని ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

900 మంది మహిళలకు ఉపాధి..

పన్నా రామ్ సాధించిన విజయం కేవలం తన ఒక్కడికే పరిమితం కాలేదు. తన కంపెనీ ద్వారా సుమారు 902 మంది మహిళలకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తులను విక్రయిస్తూ సామాన్య రైతు నుంచి ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.

గమనిక: మీకు ఈ స్ఫూర్తిదాయక కథనం నచ్చిందా? పన్నా రామ్ చౌదరి లాంటి మరిన్ని విజయగాథల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి.

Show Full Article
Print Article
Next Story
More Stories