Viral Video: అరగుండ్లు కొట్టించి, మురుగు నీరు తాగించడంపై కలకలం

ఒడిశాలో మానవత్వాన్ని మంటగలిపే ఘోర ఘటన వెలుగుచూసింది. గోవు, దూడలను అక్రమ రవాణా చేస్తున్నారన్న అనుమానంతో దళిత వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు అరగుండ్లు కొట్టించడమే కాకుండా, మురుగు కాలువలోని నీరు బలవంతంగా తాగించారు.

Ramya Vegirouthu
Published on: 23 Jun 2025 4:43 PM IST
Viral Video: అరగుండ్లు కొట్టించి, మురుగు నీరు తాగించడంపై కలకలం
X

Viral Video: అరగుండ్లు కొట్టించి, మురుగు నీరు తాగించడంపై కలకలం

Viral Video: ఒడిశాలో మానవత్వాన్ని మంటగలిపే ఘోర ఘటన వెలుగుచూసింది. గోవు, దూడలను అక్రమ రవాణా చేస్తున్నారన్న అనుమానంతో దళిత వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు అరగుండ్లు కొట్టించడమే కాకుండా, మురుగు కాలువలోని నీరు బలవంతంగా తాగించారు. ఈ దారుణ ఘటన గంజాం జిల్లా ధారాకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని జహాడ గ్రామంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే, బ్రహ్మపురం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హరిపూర్‌లోని ఓ వ్యక్తి నుంచి ఓ ఆవు, రెండు దూడలు కొనుగోలు చేసి వాటిని నడిపించుకుంటూ తమ సొంతూరికి బయలుదేరారు. ఖారిగుమ్మ వద్ద ఏడుగురు నుంచి ఎనిమిది మంది మానవత్వాన్ని మరిచినట్లు వారిని ఆపి, వీరు జంతువులను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా బాధితులను డబ్బుల కోసం బెదిరించి, వారు నిరాకరించగానే విచక్షణలేని రీతిలో చితక్కొట్టారు.

తర్వాత బాధితుల్ని అరగుండ్లు కొట్టించడంతోపాటు, దూరం నడిపించుకుంటూ జహాడ గ్రామానికి తీసుకువచ్చి అక్కడ మురుగు నీటిని బలవంతంగా తాగించారు. అంతటితో ఆగకుండా వీధుల్లో మోకాళ్లపై నడిపించారు. వీరిద్దరూ ఎలాగోలా తప్పించుకుని తమ గ్రామానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయాల కారణంగా ఆసుపత్రిలో చేర్పించబడ్డారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ధారాకోట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చంద్రికా స్వైన్ స్పష్టం చేశారు. ఈ అమానుష ఘటనపై సామాజిక వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story