Viral Video: ఉపాధ్యాయురాలిపై విద్యార్థి చెంపదెబ్బ

Viral Video: గుజరాత్‌లో దారుణం, ఆలస్యంగా వచ్చినందుకు ప్రశ్నించిన టీచర్‌పై విద్యార్థి దాడి. 18 ఏళ్ల విద్యార్థిని అరెస్ట్ చేసిన పోలీసులు. పరీక్షా హాల్‌లోనే చెంపదెబ్బ కొట్టిన ఉదంతం కలకలం రేపుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Feb 2026 9:14 AM IST
Viral Video
X

Viral Video: ఉపాధ్యాయురాలిపై విద్యార్థి చెంపదెబ్బ

Viral Video: విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుల పట్ల కనీస గౌరవం లేని ఓ విద్యార్థి దుశ్చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరీక్షకు ఆలస్యంగా వచ్చినందుకు ప్రశ్నించిన ఉపాధ్యాయురాలిపై ఓ 18 ఏళ్ల విద్యార్థి తోటి విద్యార్థుల ముందే చెంపదెబ్బ కొట్టి దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లా షేహ్రా పట్టణంలో చోటుచేసుకుంది.

అసలేం జరిగింది?

జనవరి 24న ఎస్‌జే దేవ్‌ హైస్కూల్‌లో 12వ తరగతి సెకండ్‌ ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతున్నాయి. మొహమ్మెద్‌ ఖాన్‌ అన్సారీ అనే విద్యార్థి పరీక్షకు చాలా ఆలస్యంగా హాజరయ్యాడు. హాల్‌లోకి రాగానే టీచర్ "ఎందుకు ఆలస్యమైంది?" అని ప్రశ్నించారు. ఈ చిన్న ప్రశ్నకు ఆగ్రహంతో ఊగిపోయిన ఆ విద్యార్థి, అందరి ముందే టీచర్‌ను చెంపదెబ్బ కొట్టాడు.

"నేనేం చేసినా ఇంట్లో ఎవరూ అడగరు.. నన్ను అడగడానికి నువ్వు ఎవరు?" అంటూ ఆమెపై కేకలు వేశాడు.

బెదిరింపులు.. అరెస్ట్:

ఈ ఘటన అంతటితో ఆగలేదు. మూడు రోజుల తర్వాత ఆ విద్యార్థి తన తండ్రితో పాటు మరో 15-20 మంది స్నేహితులను వెంటేసుకుని స్కూల్‌కు వచ్చాడు. "పట్టణంలో ఒంటరిగా ఉంటున్నావు.. జాగ్రత్త!" అంటూ బాధితురాలిని బహిరంగంగా బెదిరించాడు. దీంతో ప్రాణభయంతో సదరు ఉపాధ్యాయురాలు పోలీసులను ఆశ్రయించారు.

పోలీసుల చర్యలు: పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అంకుర్‌ చౌదరి కథనం ప్రకారం.. బాధితురాలి ఫిర్యాదుతో ఫిబ్రవరి 3న కేసు నమోదు చేసిన పోలీసులు అన్సారీని అరెస్ట్‌ చేశారు. అయితే, అరెస్ట్ అయిన కొద్దిసేపటికే అతను బెయిల్‌పై విడుదల కావడం గమనార్హం. విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల రక్షణ, విద్యార్థుల ప్రవర్తనపై ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story