YS Reddy: వైఎస్‌ రెడ్డికి చెందిన మొత్తం రూ.32 కోట్ల ఆస్తుల సీజ్‌

Dhivi
Updated on: 16 May 2025 12:23 PM IST
Total assets worth Rs. 32 crore belonging to YS Reddy seized
X

 YS Reddy: వైఎస్‌ రెడ్డికి చెందిన మొత్తం రూ.32 కోట్ల ఆస్తుల సీజ్‌

YS Reddy: ముంబైలోని ఓ టౌన్ ప్లానింగ్ అధికారి యాదగిరి శివకుమార్ రెడ్డి అవినీతి బట్టబయలయ్యింది. ఈడీ దాడుల్లో సదరు అధికారి అక్రమ సంపాదన వెలుగులోకి వచ్చింది. అతనికి సంబంధించిన 12 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించగా ఎన్నో నివ్వెరపోయే నిజాలు బయటకు వచ్చాయి. అరచేతి మందం కలిగిన భారీ బంగారు బిస్కెట్లు చూసి ఈడీ అధికారులు ముక్కున వేలేసుకున్నారు.

అసలు విషయం ఏంటంటే..ముంబైలోని శివసాయివిరార్ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న యాదగిరి శివకుమార్ రెడ్డికి చెందిన ముంబై, హైదరాబాద్ లోని 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 9. 04కోట్ల నగదు, రూ. 23.25 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు సహా రూ. 32.29కోట్ల విలువైన ఆస్తులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీవీఎంసీలో 2009 నుంచి అక్రమ నిర్మాణాల కుంభకోణం జరుగుతోంది. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కలిసి 41 అక్రమ నిర్మాణాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. దీంతో పెద్దెత్తున అక్రమ కట్టడాలు వెలిశాయి.

ఈ నేపథ్యంలో 41 అక్రమ కట్డడాలను కూల్చివేయాలని 2024 జులై 8న బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతేడాది ఫిబ్రవరి 20న అక్రమ కట్టడాలను వీవీఎంసీ కూల్చివేసింది.భవనాల కూల్చివేత తర్వాత వాటి యజమానులు తమకు భూములు, భవనాలు అమ్మిన బ్రోకర్లు, బిల్డర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కేసులు దర్యాప్తు చేయగా ఇదొక పెద్ద కుంభకోణమని గుర్తించారు. ఆతర్వాత రంగంలోకి దిగిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అక్రమ నిర్మాణాల వెనక స్థిరాస్తి వ్యాపారులు సీతారామన్ గుప్తా, అరుణ్ గుప్తా, టౌన్ ప్లానింగ్ అధికారి శివకుమార్ రెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చింది. వీరిలో శివకుమార్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని గుర్తించిన ఈడీ అధికారులు బుధ, గురువారాల్లో ముంబై, హైదరాబాద్ లో ఏకకాలంలో సోదాలు చేశారు.

Dhivi

Dhivi

Next Story