Top 6 News @ 6PM: పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు ముద్దాయిలకు బెయిల్.. మరో 5 ముఖ్యాంశాలు


పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు ముద్దాయిలకు బెయిల్: మరో 5 ముఖ్యాంశాలు
top 6 news of the day December 18 th 2024
పరిటాల రవి హత్య కేసులో దోషులకు ఏపీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.
1.పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు ముద్దాయిలకు బెయిల్
పరిటాల రవి హత్య కేసులో దోషులకు ఏపీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ3 పండుగ నారాయణ రెడ్డి, ఏ 4 రేఖమయ్య, ఏ5 భజన రంగనాయకులు, ఏ6 వడ్డే కొండ, ఏ8 ఓబిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. 18 ఏళ్ల తర్వాత ముద్దాయిలకు బెయిల్ మంజూరైంది. 2005 జనవరి 24న అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలోనే ఆయన హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి మొద్దు శ్రీనును అనంతపురం జైల్లో ఓం ప్రకాష్ అనే ఖైదీ హత్య చేశారు
2.లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డి సహా నిందితులకు బెయిల్
లగచర్ల దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరో 20 మందికి నాంపల్లి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రతి బుధవారం పోలీసుల ముందు హాజరుకావాలని కోర్టు షరతు విధించింది. ఈ ఏడాది నవంబర్ లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు విషయమై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘటనపై నమోదైన కేసులో అరెస్ట్ చేశారు.
3. హైడ్రా ఏర్పడక ముందు కట్టడాలు కూల్చివేయం:రంగనాథ్
హైడ్రా ఏర్పడక ముందు అనుమతిచ్చిన ఏ కట్టడాలను కూల్చబోమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్లలో నివాసం ఉంటే వాటిపై ఎలాంటి చర్యలుండవన్నారు. ఎఫ్ టీ ఎల్ లో అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య కట్టడాలను కూలుస్తామని ఆయన స్పష్టం చేశారు. అనుమతులు రద్దైనా నిర్మాణాలు చేస్తే అక్రమ కట్టడాలుగా పరిగణిస్తామని ఆయన చెప్పారు.
4.ఫార్మూలా ఈ - కారు రేసుపై అసెంబ్లీలో చర్చించాలి: రేవంత్ కు కేటీఆర్ లేఖ
ఫార్మూలా-ఈ కారు రేసు వ్యవహారంపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఫార్మూలా- ఈ కారు రేసు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద చల్లుతోందన్నారు. దీనిపై చర్చిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. హైదరాబాద్ కు మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే ఫార్మూలా- ఈ కారు రేసు నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు.
5.నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ సోకినట్టుగా అనుమానాలున్నాయి. ఈ బాలుడికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బాలుడి బ్లడ్ శాంపిల్స్ ను పుణె ల్యాబ్ కు పంపారు.గ్రామంలో జీజీహెచ్ వైద్యులు వెంకటాపురం గ్రామంలో వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైరస్ తో భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ఆనం నారాయణ రెడ్డి చెప్పారు.
6.ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద మునిగిన బోటు
ముంబై(mumbai) సముద్ర తీరంలో బుధవారం పడవ(Boat) మునిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో పడవలో 30 మంది ఉన్నారు. ఎలిఫెంటా దీవికి(Elephanta Island) వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



