Stampede : దళపతి విజయ్ ర్యాలీలో పెను విషాదం.. తొక్కిసలాటలో 6గురు చిన్నారులు సహా 39మంది మృతి

Stampede : కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళళిగ వెట్రి కజగం పార్టీ నిర్వహించిన ర్యాలీలో శనివారం (సెప్టెంబర్ 27) తీవ్ర విషాదం సంభవించింది.

CR Reddy
Published on: 28 Sept 2025 9:48 AM IST
Thalapathy Vijay Rally Stampede Death Toll Rises to 39 in Karur Tragedy!
X

Stampede: దళపతి విజయ్ ర్యాలీలో పెను విషాదం.. తొక్కిసలాటలో 6గురు చిన్నారులు సహా 39మంది మృతి

Stampede : కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళళిగ వెట్రి కజగం పార్టీ నిర్వహించిన ర్యాలీలో శనివారం (సెప్టెంబర్ 27) తీవ్ర విషాదం సంభవించింది. తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ఈ రాజకీయ సభలో జరిగిన తొక్కిసలాట కారణంగా మృతుల సంఖ్య 39కి చేరింది.

ఎలా జరిగింది?

దళపతి విజయ్ అంటే తమిళనాడులో ఎంతటి ప్రజాదరణ ఉందో తెలిసిందే. ఆయన ఎక్కడికి వెళ్లినా భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలివస్తారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, తన పార్టీ తమిళిగ వెట్రి కజగం ప్రచారంలో భాగంగా కరూర్ జిల్లాలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి అంచనా ప్రకారం 60 వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యారని సమాచారం. తమ అభిమాన నటుడిని/నాయకుడిని దగ్గర నుంచి చూడాలనే ఉద్దేశంతో ప్రజలంతా ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట కారణంగానే ఈ దుర్ఘటన జరిగింది.

మృతులు, క్షతగాత్రుల వివరాలు

ఈ భీకర దుర్ఘటనలో మొత్తం 39 మంది మరణించారు. మృతి చెందిన వారిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాలను నియంత్రించడం సాధ్యం కాకపోవడం వల్లే పరిస్థితి చేజారిపోయిందని తెలుస్తోంది.

పరిహారం, సంతాపం

ఈ విషాద ఘటన గురించి తెలిసిన వెంటనే దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వంటి వారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మృతుల కుటుంబాలకు తలా రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి తలా రూ.లక్ష చొప్పున ಪರಿహారం అందిస్తామని తెలిపారు. "తమిళనాడులో జరిగిన ఏ రాజకీయ ర్యాలీలోనూ ఇంత పెద్ద దుర్ఘటన ఎప్పుడూ జరగలేదు" అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కోసం రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తొక్కిసలాటకు దారితీసిన అసలు కారణాలు ఏమిటనే దానిపై విచారణ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

Next Story