Obscenity on OTT: ఓటిటిల్లో శృతిమించుతున్న అశ్లీలంపై సుప్రీం కోర్టు సీరియస్... కేంద్రానికి ఆదేశాలు

Pavan Reddy
Published on: 28 April 2025 6:28 PM IST
Obscenity on OTT: ఓటిటిల్లో శృతిమించుతున్న అశ్లీలంపై సుప్రీం కోర్టు సీరియస్... కేంద్రానికి ఆదేశాలు
X

Obscene Content on OTT platforms: ఓటిటి మాధ్యమాలతో పాటు సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు, కథనాలు శృతి మించుతుండటంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ఓటిటిలు, సోషల్ మీడియాలో పెరుగుతున్న అశ్లీలంపై అడ్డుకట్ట వేయాల్సిందిగా కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు... ఆయా మాధ్యమాలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. సామాజిక విలువలు పెరిగేలా ఓటీటీలు, సామాజిక మాధ్యమాలు బాధ్యతగా నడుచుకోవాలని కోర్టు గుర్తుచేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ పిల్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం మాట్లాడుతూ.. ఓటిటిలు, సోషల్ మీడియా వేదికలకు కూడా సామాజిక బాధ్యత ఉండాలని చురకలు అంటించింది. అశ్లీల వీడియోలు, కథనాలు సమాజంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడింది. అందుకే ఓటిటి మాధ్యమాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఇకపై అశ్లీల కంటెంట్‌కు తావులేకుండా మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు జారీచేసింది. అలాగే నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, ఉల్లు, ఆల్ట్, ఎక్స్ (గతంలో ట్విటర్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ఓటిటి, సామాజిక మాధ్యమాలకు కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

NCCA ఏర్పాటు చేయాలన్న పిటిషనర్

ఓటిటి, సోషల్ మీడియా మాధ్యమాలపై అశ్లీల కథనాలను నిషేధించాలని పిల్ (PIL) దాఖలు చేసిన పిటిషనర్, దేశంలో నేషనల్ కంటెంట్ కంట్రోల్ అథారిటీ ( NCCA ) ను ఏర్పాటు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఓటిటి, సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసే కంటెంట్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతలను ఎన్సీసీఏకు ఇవ్వడం వల్ల సమాజంపై వాటి దుష్ప్రభావం తగ్గించవచ్చని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయమై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తూ కోర్టు కేంద్రానికి పలు సూచనలు చేసింది.

Pavan Reddy

Pavan Reddy

Next Story