Bharat Jodo Yatra: కర్ణాటకలో ప్రవేశించిన రాహుల్‌ యాత్ర

Bharat Jodo Yatra: బండిపూర్‌ వద్ద కర్ణాటకలోకి రాహుల్‌ ఎంట్రీ

Rama Rao
Updated on: 30 Sept 2022 8:31 PM IST
Rahul Gandhi Bharat Jodo Yatra Enters Karnataka
X

Bharat Jodo Yatra: కర్ణాటకలో ప్రవేశించిన రాహుల్‌ యాత్ర

Bharat Jodo Yatra: ఒకవైపు కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలపై ఊపందుకుంటోంది. పార్టీ ముఖ్య నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర కూడా అంతే జోష్‌తో సాగుతోంది. 19 రోజుల పాటు కేరళలోని సాగిన జోడో యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించింది. బండిపూర్‌ వద్ద మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాహుల్‌కు స్వాగతం పలికారు. రాహుల్‌ యాత్రతో భారత దేశ సామాజిక-ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను పరిరక్షించేందుకు ప్రతి భారతీయుడు ఏకతాటికిపై వచ్చి మాట్లాడే వీలును కల్పిస్తుందని సిద్ద రామయ్య ట్వీట్‌ చేశారు. రాహుల్‌ యాత్రలో 4 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పక్షంపై కాంగ్రెస్‌ పార్టీ ఉధృతంగా పోరాటం చేస్తోంది. రాహుల్‌ గాంధీ యాత్రతో కాంగ్రెస్‌ శ్రేణులకు మరింత బూస్ట్‌ ఇవ్వనున్నది.

కర్ణాటకలో సాగే రాహుల్‌ యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంకగాంధీ పాల్గొనే అవకాశం ఉంది. అయితే వారు ఎప్పుడు యాత్రలో పాల్గొంటారనే విషయం మాత్రం ఇంకా స్పష్టత రాలేదని కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సలీమ్‌ అహ్మద్‌ తెలిపారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్‌ జోడో యాత్ర 23వ రోజుకు చేరుకుంది. తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన రాహుల్‌ యాత్ర.. తాజాగా కేరళ నుంచి కర్ణాటకలోని బండిపూర్‌లో ప్రవేశించింది. చామరాజనగర్‌ జిల్లాలోని గండ్లుపేట నుంచి కర్ణాటకలో యాత్రను ప్రారంభిస్తున్నట్టు కాంగ్రెస్‌ శ్రేణులు తెలిపాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 21 రోజుల పాటు.. తొమ్మిది జిల్లాల మీదుగా 511 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర సాగనున్నది.

ఈ యాత్రలో మొత్తం 7 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు 22 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్‌ అవుతాయి. ఇక గుండ్లుపేట, మైసూర్‌, బళ్లారిలో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్టు కేపీసీసీ ప్రకటించింది. కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా నుంచి.. రాహుల్‌ యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనున్నది. అక్టోబరు 24న రాయచూర్‌ జిల్లా నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మక్తల్‌లో తెలంగాణలో ప్రేవేశించి.. 366 కిలోమీటర్లమేర సాగనున్నది. మొత్తం నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లోని 9 అసెంబ్లీల్లో రాహుల్‌ యాత్ర సాగనున్నది. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్‌ జోడో యాత్ర.. 150 రోజుల పాటు సాగనున్నది. ఈ యాత్ర మొత్తం 3వేల 570 కిలోమీటర్ల మేర సాగనున్నది.సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో జోడో యాత్రను రాహుల్‌ గాంధీ ప్రారంభించిన ఈ పాదయాత్ర.. జమ్మూ కశ్మీర్‌లో ముగుస్తుంది.

Rama Rao

Rama Rao

Next Story