TOP 6 NEWS @ 6PM: డీలిమిటేషన్‌పై స్టాలిన్ బాటలోనే రేవంత్ సర్కార్

నాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది.

లోడె నర్సింహ్మ
Updated on: 12 March 2025 6:10 PM IST
Mallu Bhatti vikramarka writes letter to poitical partis on delimitation
X

స్టాలిన్ బాటలోనే రేవంత్ సర్కార్: మరో ఐదు ముఖ్యాంశాలు

1.నియోజకవర్గాల పునర్విభజనపై ఆల్ పార్టీ మీట్

జనాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. జనాభా ప్రాతిపదికన నిర్వహించే నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రానికి నష్టమని ప్రభుత్వం భావిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు ఆహ్వానిస్తూ మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి లేఖ రాశారు. రాజకీయ పార్టీల స్పందన ఆధారంగా ఈ సమావేశం తేదీ, ప్లేస్ ను డిసైడ్ చేయనుంది.2.

2.ట్రంప్‌తో చర్చలకు సిద్దంగా లేం: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్

అణు ఒప్పందంపై అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్దంగా లేమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ చెప్పారు. ఈ ఒప్పందంపై ఇరాన్ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆదేశాలు ఇవ్వడం, బెదిరించడం సరైంది కాదని ఆయన అన్నారు. ట్రంప్ తో చర్చలకు తాను సిద్దంగా లేనని ఆయన తేల్చి చెప్పారు. చర్చల కంటే ఆధిపత్యమే లక్ష్యంగా అమెరికా కొత్త వ్యూహాలు ఉన్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ వ్యాఖ్యానించారు.

3.తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళం తప్పనిసరి: హైకోర్టు

తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులు తప్పనిసిగా తమిళం చదవడం, రాయడం నేర్చుకోవాలని మద్రాస్ హైకోర్టు మధుర బెంచ్ ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళం తప్పనిసరి అని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర భాష వచ్చి ఉండాలని కోర్టు తెలిపింది.

4.మార్చి 19న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 10న ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. మార్చి 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు. ఈ నెల 14న హోలీ పండుగ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకర బిల్లులను ప్రవేశపెడతారు. ఈ నెల 19న అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.ఈ నెల 27 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 21 నుంచి 26 వరకు పద్దులపై చర్చిస్తారు.

5.భద్రతను కల్పించాలి: పోలీసులను కోరిన దస్తగిరి

వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నందున తనకు రక్షణ కల్పించాలని దస్తగిరి కడప ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి సీబీఐకి అప్రూవర్ గా మారారు. గతంలో ఉన్న భద్రతను ఇప్పుడూ కొనసాగించాలని ఆ వినతిపత్రంలో కోరారు. చంద్రబాబు ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

6.కోటరీతోనే జగన్ కు దూరమయ్యా: విజయసాయిరెడ్డి

మీ చుట్టూ ఉంటే వారి మాటలు విని తప్పుదోవ పట్టకూడదని తాను వైఎస్ఆర్‌సీపీ చీఫ్ వైఎస్ జగన్ ను కోరినట్టుగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.కాకినాడ పోర్టు అంశానికి సంబంధించి నమోదైన కేసులో సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి బుధవారం హాజరయ్యారు. విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కోటరీకి అనుకూలంగా ఉన్న వారినే జగన్ వద్దకు తీసుకెళ్తారని ఆయన విమర్శించారు. మీ మనసులో తనకు స్థానం లేదని.. అందుకే తాను పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని విజయసాయిరెడ్డి చెప్పారు.

లోడె నర్సింహ్మ

లోడె నర్సింహ్మ

Next Story