India: ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారత్‌ ఓటు

India: గాజాలో ఇజ్రాయెల్‌ సెటిల్మెంట్‌ కార్యకలాపాలకు పాల్పడటాన్ని ఖండించిన భారత్

Jyothi
Updated on: 13 Nov 2023 9:53 AM IST
India votes in favour of UN Resolution Against Israeli Settlements in Palestine
X

India: ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారత్‌ ఓటు

India: ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రవేశ పెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్‌ ఓటు వేసింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగం, తూర్పు జెరూసలెం, సిరియాకు చెందిన గోలాన్‌ హైట్స్‌లో ఇజ్రాయెల్‌ సెటిల్మెంట్‌ కార్యకలాపాలకు పాల్పడటాన్ని ఖండిస్తూ యూఎన్‌ఓలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయగా.. 18 దేశాలు తటస్థ వైఖరి తీసుకొన్నాయి. ఇక కెనడా, హంగేరీ, ఇజ్రాయెల్‌, మార్షల్‌ఐలాండ్స్‌, ఫెడరేటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ మైక్రోనేషియా, నౌరు, అమెరికా మాత్రం తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి.

ఇటీవల ఇజ్రాయెల్‌-హమాస్‌ యద్ధాన్ని తక్షణమే ఆపేయాలని కోరుతూ జోర్డాన్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. దీనిలో హమాస్‌ అనాగరిక చర్యలను పేర్కొనకపోవడాన్ని భారత్‌ వ్యతిరేకించింది. అప్పట్లో ఈ తీర్మానం ఓటింగ్‌కు భారత్‌ సహా 45 దేశాలు గైర్హాజరయ్యాయి. 120 దేశాలు మాత్రం దీనికి అనుకూలంగా ఓటేశాయి.

హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 11,078 మంది గాజావాసులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించారు. వారిలో దాదాపు 40శాతం మంది చిన్నారులే ఉన్నారని వెల్లడించారు. గాజాపై నిరంతరం వైమానిక, శతఘ్ని దాడులు నిర్వహిస్తోందని ఆరోపించారు.

మరోవైపు హమాస్‌ ప్రధాన స్థావరంగా అనుమానిస్తున్న అల్‌-షిఫా ఆస్పత్రి వద్ద ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగుతున్నాయి. అయితే, గాజా నుంచి సామాన్య పౌరులను తరలించేందుకు తాము సహకరిస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఉత్తర గాజా నుంచి దక్షిణ ప్రాంతానికి ప్రజలు వలస వెళ్లేందుకు వీలుగా.. ఇజ్రాయెల్‌ కొన్ని గంటలపాటు ఫైరింగ్‌ను నిలిపివేసింది. ఇక విదేశీ పాస్‌పోర్టులు ఉన్న వారి కోసం ఈజిప్టు సరిహద్దులోని రఫా క్రాసింగ్‌ను ఆదివారం మరో సారి తెరిచారు.

Jyothi

Jyothi

Next Story