Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..

Heavy Rains: వరద ఉద్ధృతి ఉత్తరాది విలవిల..

Jyothi
Published on: 10 July 2023 7:41 PM IST
Heavy Rains In North India
X

Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..

Heavy Rains: హిమాచల్ ప్రదేశ్‌ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదుల్లో నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ కొండల నుంచి జారు వారుతున్న వరద నీరు నదీ ప్రవాహాలను తలపిస్తున్నాయి.

నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో కొండ వాలులో ఉన్న మండి జిల్లాలోని ఒనైర్ గ్రామాన్ని జల ప్రవాహం చుట్టుముట్టింది. అటవీ ప్రాంతంలోని పెద్ద పెద్ద చెట్లను వేర్లతో సహా పెకిలించుకుని గ్రామంలోని మార్కెట్ ప్రాంతంపై ప్రవహించింది. వరద ఉద్ధృతికి ఇళ్లు, షాపులు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి.

ఉత్తర భారతం మొత్తం భారీ వర్షాలతో ముప్పును ఎదుర్కొంటోంది. ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరఖండ్, హిమాచల్ ప‍్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి.

ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున నదితో పాటు పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది.

ఉత్తర భారతాన్ని ఎడతెరపిలేని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. కుండపోత వానలకు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌కు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఢిల్లీ, పంజాబ్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ-కశ్మీర్‌ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. యమున సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి వరద హెచ్చరికలు జారీ చేశారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్‌ నది ఉగ్రరూపం దాల్చింది. ఈ నది ఉద్ధృతికి ఇప్పటికే పలు చోట్ల వంతెనలు కొట్టుకుపోగా.. రహదారులు చీలిపోయాయి. రానున్న 24 గంటల్లో హిమాచల్‌ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలకు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 10 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు.

హిమాచల్‌లో పలు నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వరద ఉద్ధృతికి అనేక ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. ఓ చోట బస్సు నది నీటిలో కొట్టుకుపోయింది. ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో నది ప్రవాహంలో ఓ ప్రయాణికుల బస్సు చిక్కుకుపోయింది. నీటి ఉద్ధృతికి బస్సు ఓవైపు వంగిపోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యాయి. కిటికీల నుంచి కిందకు దూకారు. స్థానికులు వారిని కాపాడారు.

అటు ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లోనూ భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడుతున్నారు.

Jyothi

Jyothi

Next Story