Bharat Rice: 10.1 మిలియన్ టన్నులు విక్రయించాలని లక్ష్యంగా పెట్టున్న కేంద్రం
Bharat Rice: దేశంలో మెజార్టీ ప్రజల ప్రధాన ఆహారమైన బియ్యం ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయి. దీంతో పెరిగిపోతున్న ధరలను చూసి సామాన్యుడు ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదని పాట పాడుకోవాల్సి వస్తోంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్భనం కారణం దేశంలోని అంతర్గత ఉత్పత్తులపై కూడా ప్రభావం చూపుతోంది. బియ్యం ధరలు ఇప్పటిలో తగ్గుముఖం పట్టే పరిస్థితులు కనిపించకపోవడం ఆందోళన కలిగించే విషయం.
బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, వంట నూనె, నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చేశాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంచంలో పిడికెడు బువ్వ కోసం ఖాళీ కడుపుతో పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలో నిత్యావసరాల ధరల పెరుగుదలను అరికట్టేందుకు కేంద్ర చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంది. వచ్చే వారం నుంచి భారత్ రైస్ చొరవ కింద సబ్సిడీ ధాన్యాన్ని రిటైల్ అవుట్లెట్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిటైల్ అవుట్లెట్ల ద్వారా కిలో బియ్యాన్ని 29కి విక్రయించే అధికారిక నిర్ణయం వచ్చే రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బియ్యం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. రిటైల్ మార్కెట్లో సన్నబియ్యం 50 నుంచి 60 వరకు పలుకుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం బియ్యం ధరలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించింది. భారత్ రైస్ ను కేవలం 29కి విక్రయించేందుకు సన్నాహాలను ప్రారంభించింది.
వచ్చే వారం నుంచి రిటైల్ మార్కెట్లో కిలో 29 చొప్పున భారత్ రైస్ విక్రయిస్తామని ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. వివిధ రకాల సరుకులపై ఎగుమతి ఆంక్షలు ఉన్నప్పటికీ, పోయిన ఏడాదితో పోలిస్తే, బియ్యం రిటైల్ ధరలు 13.8 శాతం, హోల్సేల్ ధరలు 15.7 శాతం పెరిగాయన్నారు. నిత్యవసర సరుకుల ధరలు, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం నియంత్రించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని... అందులో భాగంగానే సబ్సిడీలో భారత్ రైస్ ను వచ్చే వారం నుండి రిటైల్ మార్కెట్లో అమ్మేందుకు సిద్ధమైందని సంజీవ్ చోప్రా వెల్లడించారు.
నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో బియ్యం విక్రయిస్తామని సంజీవ్ చోప్రా వెల్లడించారు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో కూడా భారత్ రైస్ కొనుగోలు చేయొచ్చన్నారు. ఐదు, పది కిలోల ప్యాక్స్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా.. 5లక్షల టన్నుల బియ్యాన్ని రిటైల్ మార్కెట్లో అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే కిలో 27.50 చొప్పున భారత్ ఆట, 60 కిలో భారత్ దాల్ విక్రయిస్తున్నామని తెలిపారు. బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తేసే ఆలోచలో కేంద్ర ప్రభుత్వం ఉందన్న వార్తలను ఆయన ఖండించారు.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రిటైలర్స్, హోల్సేలర్స్, ప్రాసెసర్లు, మిల్లర్లు తమ వద్ద ఉన్న ఆహార ధాన్యాల స్టాక్ను ప్రకటించాలని సంజీవ్ చోప్రా ఆదేశించారు. అన్ని బియ్యం కేటగిరీల స్టాక్ పొజిషన్ బ్రోకెన్ రైస్, నాన్ బాస్మతి వైట్ రైస్, పారా బాయిల్డ్ రైస్, బాస్మతి బియ్యం నిల్వ వివరాలను ప్రతి వారం ఆహార, ప్రజా పంపిణీ శాఖ పోర్టల్లో ప్రకటించాల్సి ఉంటుందన్నారు. బియ్యం నిల్వలపై పరిమితి విధించే ఆలోచన ఇప్పుడైతే లేదన్నారు. స్టాక్ పొజిషన్ తో ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
బియ్యం మినహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉన్నాయని చెప్పారు. గోధుమల ధరలు నియంత్రించడానికి ప్రభుత్వం వీకెండ్లో ఈ వేలం ద్వారా స్టాక్ ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తూనే ఉందన్నారు. మొత్తం 10.1 మిలియన్ టన్నులు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో 7.5 మిలియన్ టన్నులు ఇప్పటికే ఓఎంఎస్ఎస్ కింద అమ్మేశామన్నారు.
దేశ వ్యాప్తంగా బియ్యం ధరల సమస్య ఆందోళనకరంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆశాజనక భారత్ రైస్ చొరవ ధరలను తగ్గించడంలో కొంత ప్రభావం చూపవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. రికార్డు స్థాయిలో ఉత్పత్తి, ఎఫ్సీఐ వద్ద పుష్కలంగా నిల్వలు, ధాన్యం ఎగుమతులపై పలు పరిమితులు, సుంకాలు విధించినప్పటికీ దేశీయంగా బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలించే విషయమని ఆహార నిపుణులు అంటున్నారు.
భారత్ రైస్ కింద.. FCI వద్ద దాదాపు 0.45 మెట్రిక్ టన్నుల నాన్-ఫోర్టిఫైడ్ రైస్ స్టాక్ను రైతుల సహకార సంస్థ నాఫెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ కేంద్రీయ భాండార్స్ వంటి ఏజెన్సీల ద్వారా రిటైల్ విక్రయాల కోసం మొదటగా అందించనున్నట్లు సమాచారం. జూలై, 2023 నుండి FCI ప్రస్తుత సంవత్సరానికి 5 మెట్రిక్ టన్నుల కేటాయింపులకు వ్యతిరేకంగా ఇప్పటివరకు వారపు ఇ-వేలం ద్వారా 0.16 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే విక్రయించగలిగింది.
డిసెంబర్లో రిటైల్ బియ్యం ధరలు 12.33% పెరిగాయి. అక్టోబర్ 2022 నుండి బియ్యం ధరలు పెరిగిన స్థాయిలో ఉన్నాయి. FCI స్టాక్ నుండి మిగులు బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ఇది జరిగింది.
ప్రభుత్వం సన్న బియ్యం ఎగుమతులను నిషేధించింది. దేశీయ సరఫరాలను మెరుగుపరచడానికి గత సంవత్సరం పార్-బాయిల్డ్ రైస్పై 20% ఎగుమతి సుంకాలను విధించింది. ప్రస్తుతం, ఎఫ్సిఐ 19.54 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలను కలిగి ఉంది. మిల్లర్ల నుండి స్వీకరించదగిన 37 మెట్రిక్టన్నులు మినహాయించి... జనవరి 1కి 7.61 మెట్రిక్ టన్నుల బఫర్కు వ్యతిరేకంగా బియ్యం స్టాక్ ఉంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire