ఢిల్లీ సరిహద్దులు వీడేదిలేదు- భారతీయ కిసాన్‌ యూనియన్‌

Samba Siva Rao
Published on: 7 Feb 2021 6:45 PM IST
ఢిల్లీ సరిహద్దులు వీడేదిలేదు- భారతీయ కిసాన్‌ యూనియన్‌
X

రైతులు నిరసనలు ఫైల్ ఫోటో 

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమం కొనసాగుతుంది. అన్నదాతల నినాదాలతో ఢిల్లీ సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. ఆందోళనలకు కేంద్రంగా సింఘు, టిక్రీ, గాజీపూర్‌ సరిహద్దుల్లో పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. అటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతను చేపట్టారు. మరోవైపు.. చట్టాల్ని రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

కొత్త వ్యవసాయ చట్టాలు రద్దయ్యే వరకూ ఢిల్లీ సరిహద్దులు వీడేదిలేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రకటించింది. అదేవిధంగా... 'మేం రైతులం-సైనికులం' అనేది ఇక మీదట తమ ఉద్యమ నినాదంగా ఉంటుందన్నారు. మరోవైపు చట్టాల ఉపసంహరణకు కేంద్రానికి అక్టోబర్‌ 2 వరకు గడువునిస్తు్న్నట్లు అన్నదాతలు తెలియజేశారు. ఇదిలా ఉంటే.. నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న మరో రైతు మృతి చెందాడు. టిక్రీ ప్రాంతానికి సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక సంఘటనా స్థలంలో ఓ ఆత్మహత్య లేఖ లభించినట్లు పోలీసులు వెల్లడించారు. సదరు రైతు చేతితో రాసిందిగా భావిస్తున్న ఈ లేఖలో.. మోదీ ప్రభుత్వం తేదీ తర్వాత మరో తేదీని ప్రకటిస్తోందని.. అయితే వ్యవసాయ చట్టాలు నిజంగా ఎప్పుడు రద్దవుతాయో ఎవరికీ తెలీదని.. తోటి వ్యవసాయదారులను ఉద్దేశించి రాశాడు. కాగా.. రెండు వారాల క్రితం హరియాణాకు చెందిన మరో రైతు విషపూరిత పదార్ధాన్ని తీసుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story