పట్టు వీడిన రైతులు.. మెట్టు దిగని కేంద్రం

farmers protest in delhi
x

Farmers Protest

Highlights

* కొత్త చట్టాల వ్యవహారంలో కొనసాగుతోన్న ప్రతిష్టంభన * కేంద్రంతో మరోసారి చర్చలకు సిద్ధం అన్న రైతులు

రైతులు మెట్టు దిగారు. కేంద్ర ప్రభుత్వంతో మరోమారు చర్చించేందుకు రైతు సంఘాల సమాఖ్య అంగీకరించింది. ఈ నెల 29న ఉదయం 11గంటలకు చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్‌కు లేఖ రాశారు. ఇక అటు బీజేపీకి మిత్రపక్షం ఆర్‌ఎల్పీ భారీ షాక్ ఇచ్చింది. ఎన్డీఏ కూటమీకి గుడ్‌బై చెప్పింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని తేల్చి చెప్పింది.

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారుల్లో నెల రోజులుగా అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రైతులు పట్టు వీడం లేదు. కేంద్రం మెట్టు దిగడం లేదు. దీంతో ఈ అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. చర్చలకు రావాలని కేంద్రం పదే పదే విజ్ఞప్తి చేసింది. అయితే.. కేంద్రం ఆహ్వానంపై రైతు సంఘాలు స్పందించాయి. ఈ నెల 29న ఉదయం 11గంటలకు చర్చలు జరుపుతామని సంయుక్త్ కిసాన్ మోర్చా నేతలు తెలిపారు.

ఢిల్లీ శివారులో చేస్తున్న రైతులకు మద్ధతు పెరుగుతోంది. అటు పంజాబ్ నుంచి ఢిల్లీకి రైతులు భారీగా తరలి వస్తున్నారు. ఢిల్లీ శివారులోని సింఘు, టిక్రీ దగ్గర ఆందోళనలు చేస్తున్న రైతుల కోసం రేషన్, ఇతర నిత్యావసర సరుకులు తీసుకొని చాలామంది రైతులు బయల్దేరారు. సంగ్రూరు, అమృత్‌సర్, తర్ తరన్, గుర్దాస్‌పూర్, బతిందా జిల్లా నుంచి ఢిల్లీకి బయలుదేరినట్లు రైతుసంఘాలు నేతలు తెలిపారు. మంచు విపరీతంగా కురుస్తున్నా... వారంతా ఆందోళనల్లో పాల్గొనేందుకు వస్తున్నారని వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ఆల్ ఇండియా కిసాన్ సభ రైతుల వాహనాల జాతా కార్యక్రమం కొనసాగుతోంది. డిసెంబరు 21న వాహనాలతో రైతులు ఢిల్లీకి బయలుదేరారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోకి వాహనాల జాతా ప్రవేశించింది.

రైతు సంఘాలు, కేంద్రం మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో ఎలాంటి పరిష్కారం లభించలేదు. కేంద్రం చేసిన ప్రతిపాదనలకు రైతులు ఏమాత్రం తలొగ్గలేదు. మూడు చట్టాలను రద్దు చేసి తీరాల్సిందేనని పట్టిన పట్టు వీడడం లేదు. ఐతే సర్కార్ మాత్రం రద్దు కుదరదని బలంగా చెప్తుంది. సవరణలకు ఓకే అని స్పష్టం చేస్తోంది. కొత్త చట్టాల వల్ల ఏ ఒక్క రైతుకు నష్టం జరగదని.. ప్రతిపక్షాలు కావాలని వారిని రెచ్చగొడుతున్నాయని ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో మరోసారి రైతు సంఘాలు చర్చలకు అంగీకరించాయి. రైతులు రాసిన లేఖకు కేంద్రం ఎలా స్పందిస్తుందో ఆసక్తిగా మారింది. మరి ఈచర్చల్లో అయినా క్లారిటీ వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక బీజేపీకి మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌తంత్రిక్ పార్టీ షాక్ ఇచ్చింది. ఎన్డీయే కూటమిని వీడుతున్నట్లు ఆ పార్టీ అధినేత హనుమాన్ బెనివాల్ ప్రకటించారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా ఈ నిర్ణయానికి తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాళీదళ్ ఎన్డీయే నుంచి తప్పుకోగా తాజాగా ఆర్‌ఎల్పీ కూడా అదే బాటలో నడుస్తోంది.

ఆందోళన చేస్తు్న్న రైతుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయితే.. వ్యవసాయ చట్టాలపై చర్చకు రావాలని రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ సవాల్ విసిరారు. రైతులకు కొత్త చట్టాల ద్వారా లాభం చేకూరుతుందో.. లేదో.. వివరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులకు వచ్చే నష్టమేంటో రాహుల్ వివరించాలని సవాల్ చేశారు..మొత్తానికి మంగళవారం జరిగే చర్చలు ఓ కొలిక్కి వస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే..

Show Full Article
Print Article
Next Story
More Stories