నేడు రాజ్యసభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు

Delhi: ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసిన కాంగ్రెస్, ఆప్‌

Jyothi
Published on: 7 Aug 2023 10:24 AM IST
Delhi Ordinance Bill before Rajya Sabha Today
X

నేడు రాజ్యసభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు

Delhi: దేశ రాజధానిలో పాలనాధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ అధికార పక్షం ప్రవేశపెట్టిన ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లు ఇవాళ రాజ్యసభ ముందుకు రానుంది. దీంతో కేంద్రం ప్రవేశపెట్టే ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్ష పార్టీలు అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. బిల్లు సభ ముందుకు వస్తున్న దృష్ట్యా పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరు కావాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ విప్‌లు జారీ చేశాయి. కాంగ్రెస్ పార్టీ మూడు లైన్ల విప్ జారీ చేయగా, ఆప్ కూడా విప్ జారీ చేస్తూ, ఈనెల 7,8 తేదీల్లో తప్పనిసరిగా సభకు రాజ్యసభ ఎంపీలంతా సభకు హాజరుకావాలని ఆదేశించింది.

కొద్దికాలంగా వివాదాస్పదంగా ఉన్న ఈ ఆర్డినెన్స్‌ బిల్లును అమిత్‌షా ఈనెల 3న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యుల ప్రతిఘటన మధ్య మూజువాణి ఓటుతో బిల్లు నెగ్గింది. రాజ్యసభలోనూ బిల్లు గెలిస్తే బిల్లు అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకించేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విపక్ష పార్టీల మద్దతు కూడగట్టారు. విపక్ష పార్టీల అధినేతలను కలిసి రాజ్యసభలో ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరారు. ఆప్‌కు మద్దతుగా నిలిచి బిల్లును అడ్డుకునేందుకు విపక్ష ఇండియా కూటమి డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విపక్ష కూటమిలోని ఫ్లోర్ లీడర్లంతా మల్లిఖార్జున్ ఖర్గే ఛాంబర్‌లో సమావేశం కానున్నారు. అటు బీఆర్ఎస్‌ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశించింది.

Jyothi

Jyothi

Next Story