South Mumbai: వెయ్యి కోట్లతో ఇంటిని కొన్న డీమార్ట్ అధినేత

South Mumbai: డీ మార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి ఓ ఇంటిని కొనుగోలు చేశారు.

Kranthi
Updated on: 4 April 2021 11:50 AM IST
D-Mart Damani Buys Property Worth Above Thousand Crores
X

South Mumbai:(Photo the hans india)

South Mumbai: వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి ఓ వ్యక్తి ఇంటిని కొన్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదండోయ్ దానికి సంబంధించి ట్యాక్స్ రూపంలో ఇప్పటికే 30 కోట్లకు పైగా చెల్లించారట. వివరాల్లోకి వెళితే..డీ మార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ, తనసోదరుడు గోపీ కిషన్ తో కలిసి దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ లో రూ.1,001 కోట్లు పెట్టి ఓ ఆస్తిని కొనుగోలు చేశారు. మొత్తం 5,752.22 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తికి చదరపు అడుగుకు రూ. 1,61,670 చెల్లిస్తూ దమానీ కొనుగోలు చేశారు.

మార్చి 31న ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పూర్తయిందని, రెండు అంతస్తుల్లో ఈ భవంతి ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం, ఈ ప్రాపర్టీ రూ. 723.98 కోట్ల వ్యయమవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక ఈ డీల్ డాక్యుమెంట్ల ప్రకారం, స్టాంప్ డ్యూటీ కింద దమానీ రూ. 30 కోట్లను చెల్లించాల్సి వచ్చింది.

ఇప్పటికే ముంబైలోని అల్టామౌంట్ రోడ్ లో ఓ లగ్జరీ ఇంటిని కలిగివున్న రాధాకిషన్ దమానీ, ఈ కొత్త ఇంటిని సౌరబ్ మెహతా, వర్షా మెహతా, జయేష్ షాల నుంచి కొనుగోలు చేశారు. డీ మార్ట్ రిటైల్ చైన్ ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ ఇటీవల రూ. 113 కోట్లు పెట్టి వాధ్వా గ్రూప్ నిర్మిస్తున్న ప్రాజెక్టులో 39 వేల చదరపు అడుగుల విస్తీర్ణమున్న రెండు ఫ్లోర్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై థానేలో 8 ఎకరాల భూమిని కూడా క్యాడ్ బరీ ఇండియా (ఇప్పుడు మాండెలెజ్ ఇండియా) నుంచి రూ. 250 కోట్లతో కొనుగోలు చేసింది. ఇటీవలి కాలంలో అత్యంత ఖరీదైన డీల్ ఇదేనని నిర్మాణ రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇండియాలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీల విక్రయాల్లో ఇది కూడా ఒకటి.

Kranthi

Kranthi

Next Story