Congress Crisis Updates: కాంగ్రెస్ ను రెండు సార్లు చీల్చగలిగిన తెగువ ఉన్న నాయకులెవరున్నారు?

Congress Crisis Updates: కాంగ్రెస్ ను రెండు సార్లు చీల్చగలిగిన తెగువ ఉన్న నాయకులెవరున్నారు?
x
Highlights

Congress Crisis: జాతీయ కాంగ్రెస్ ను చీల్చి..తన పేరున కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్న ఇందిరాగాంధీ తెగువ ఉన్న నాయకులు కాంగ్రెస్ లో ఎవరున్నారు?

(హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం)

ఒకసారి దేశ చరిత్ర చూస్తే కొన్ని ఆసక్తికర ఘట్టాలు కనిపిస్తాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఏకంగా కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు చీల్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆమెను కాంగ్రెస్ నుంచి బహిష్కరించడమే ఇందుకు కారణం. ఇప్పుడున్న కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ కాదు. ఇందిరా కాంగ్రెస్. కాంగ్రెస్ నుంచి చీలి వచ్చిందే ఇందిరా కాంగ్రెస్. 1969 రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ ను వ్యతిరేకించింది ఇందిరాగాంధీ.

జాతీయ కాంగ్రెస్‌లో వచ్చిన చీలిక వలన డిసెంబర్‌ నెలలో ఇరువర్గాలు తమ మహాసభలు జరుపుకున్నాయి. నిజలింగప్ప, కామరాజ్‌, నీలం సంజీవరెడ్డి, మొరార్జీదేశాయ్‌ తదితరులు అహ్మదాబాద్‌లో సభ నిర్వహించారు. మరోవైపు ఇందిరాగాంధీ, జగ్జీవన్‌రాం, కాసు బ్రహ్మానందరెడ్డి తదితరులు బొంబాయిలో మహాసభలు జరుపుకున్నారు. బ్రహ్మానందరెడ్డి రాష్ట్రపతి ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఆ ఎన్నికల్లో ప్రధాని ఇందిరాగాంధీ బలపరిచిన వి.వి.గిరి గెలవడం విశేషం. హఠాత్తుగా చనిపోయిన రాష్త్రపతి జకీర్ హుస్సేన్ స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో పార్టీలోని విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఇందిరా గాంధీని విమర్శించే నీలం సంజీవరెడ్డిని ఇందిర వ్యతిరేక కాంగ్రెస్ అధిష్టాన వర్గం అభ్యర్థిగా నిర్ణయించింది. ఆయననే ప్రతిపాదించిన ఇందిరా గాంధీ, ఓటింగులో, స్వతంత్ర అభ్యర్థి వీవీ గిరికి మద్దతును బహిరంగంగానే ప్రకటించింది. అంతే కాదు.. తన వారందరినీ ఆయనకే ఓటెయ్యమని సూచించింది. చివరకు ఇందిరా మాట నెరవేరింది. నీలం సంజీవరెడ్డి ఓటమి పాలయ్యారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు, తన వ్యతిరేక వర్గానికి చెందిన మొరార్జీ దేశాయ్‌ని మంత్రివర్గంలోంచి వెళ్లిపోయే పరిస్థితులు కలిపించాయి. క్రమశిక్షణను ఉల్లంఘించిందన్న ఆరోపణపై, వృద్ధ నాయకత్వం ఆమెను పార్టీ నుంచి తొలగించింది. వారందరినీ అభివృద్ధి నిరోధక శక్తులు గాను-సామ్యవాద పథకాలను అడ్డుకునేవారి గాను చిత్రించింది ఇందిరా గాంధీ. పార్లమెంటరీ పార్టీ ఆమె పట్ల విశ్వాసం ప్రకటించడంతో, ఆమె ప్రధాన పదవికి ఢోకా లేకపోగా, పార్టీ చీలిపోయింది. ఇందిర గాంధీ వల్ల ఏకంగా పార్టీని చీల్చింది. ఏడాది ముందే 1971లో ఎన్నికలకు పోయి, అఖండ విజయం సాధించి పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించింది. పార్టీ గుర్తు మూడు రంగుల జెండా మధ్యలో హస్తం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా 1969లో కాంగ్రెస్ (ఆర్), కాంగ్రెస్ (ఓ)గా చీలిపోయింది. కాంగ్రెస్ (ఆర్)కు ఇందిరాగాంధీ నేతృత్వం వహించారు. కాంగ్రెస్ (ఓ)కు నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్‌లు నాయకత్వం వహించారు. అప్పుడు ఇందిరాదే పై చేయి అయింది.

గత చరిత్రలోనే మరకలు..

కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. దేశంలోనే పురాతన పార్టీ కాంగ్రెస్. భారత్‌ను ఎక్కువ కాలం పాలించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సుమారు 38 ఏళ్లపాటు పరిపాలన సాగించారు. జవహర్‌లాల్ నెహ్రూ 16 సంవత్సరాల 286 రోజులు, ఇందిరా గాంధీ 15 సంవత్సరాల 350 రోజులు(రెండు పర్యాయాలు), రాజీవ్ గాంధీ 5 సంవత్సరాల 32 రోజులు ప్రధానిగా పనిచేశారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణను ఆంధ్ర రాష్ర్టంలో విలీనం చేసి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోనూ సుమారు 42 ఏళ్లపాటు (1956-83, 1989-94, 2004-14) అధికారంలో ఉంది. అంతర్గత కారణాల వల్ల కాంగ్రెస్‌ పార్టీ మొదటిసారి 1969లో చీలిపోయింది. ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ (ఆర్‌), నిజలింగప్ప, మొరార్జీదేశాయ్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ (ఒ), కాంగ్రెస్‌ (ఒ) తరవాతి కాలంలో జనతా పార్టీలో విలీనమైంది. తిరిగి కాంగ్రెస్‌ పార్టీ 1978లో మరోసారి చీలిపోయింది.

ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ (ఐ), కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ (ఆర్‌), కాంగ్రెస్‌ (ఆర్‌) తరవాతి కాలంలో కాంగ్రెస్‌లో విలీనమైంది. 1978లో వచ్చిన రెండో చీలికలో కాంగ్రెస్ (ఐ)కు ఇందిరాగాంధీ నేతృత్వం వహించారు. రెడ్డి కాంగ్రెస్‌కు కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వం వహించారు. 1980లో బ్రహ్మానందరెడ్డి రెడ్డి కాంగ్రెస్‌ను కాంగ్రెస్ (ఐ)లో విలీనం చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి కొత్త కాంగ్రెస్‌ వైపుకు వచ్చారు. 1955 లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీకి ఎన్నుకోవడంతో, జాతీయ స్థాయిలో స్వతంత్రంగా గుర్తింపు లభించినట్లయింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఇందిర, ఏడాది కాలంలో తన రాజకీయ సమర్థతను, కాఠిన్యాన్ని ప్రదర్శించిందనాలి. ప్రపంచ చరిత్రలోనే ప్రప్రధమంగా బాలట్ ద్వారా అధికారంలోకి వచ్చిన కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేయించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత జరిగిన ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం సాధించి పెట్టింది. ఇందిరా గాంధీ మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సుముఖత చూపలేదు. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ మంత్రివర్గంలో సమాచార-ప్రసార శాఖను చేపట్టింది. శాస్త్రి హఠాన్మరణం దరిమిలా, కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం వున్నా లేకపోయినా, ఇందిరను ప్రధాన మంత్రిని చేశారు. ఇక అక్కడి నుంచి ఇందిర అధ్యాయం మొదలైంది. ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాలన మొదలైంది ఆమె నేతృత్వంలోనే.

తమ ధోరణికి అనుకూలించడనుకున్న మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రి కాకూడదనేది ఆమె ఆలోచన. అందుకే తమ అదుపు ఆజ్ఞల్లో-కనుసన్నల్లో నడుచుకుంటుందన్న ధీమాతో కామరాజ్ నాడార్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి లాంటి వారు ఇందిరా గాంధీ వైపు మొగ్గు చూపారు. కానీ భవిష్యత్‌లో ఆమె నుంచి పొంచి వున్న ప్రమాదాన్ని పసికట్ట లేకపోయారు. అనిశ్చిత పరిస్థితుల నడుమ, ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించింది. భవిష్యత్‌పై దృష్టి సారించింది ఇందిరా గాంధీ. జాతీయ స్థాయిలో యావత్ భారత దేశ ప్రజలంగీకరించే ఏకైక నాయకురాలు తానేనని గ్రహించింది ఇందిరా. ఆమె చర్యలను తప్పు పట్టిన వైరి వర్గం నవంబర్ 12, 1969లో ఇందిరాగాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు. ఫలితంగా ఇందిరా గాంధీ కొత్తపార్టీ కాంగ్రెస్ (ఐ) ని ఏర్పాటు చేసింది. తరువాతి కాలంలో ఇదే భారత జాతీయ కాంగ్రెసుగా గుర్తింపు పొందింది. మరోసారి దేశంలో ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. పార్టీ మహామహులంతా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఆ సమయంలో ఇందిరకు అండగా నిలిచిన అతి కొద్దిమంది నేతల్లో జి. వెంకటస్వామి ఒకరు. ఆనాడు ఎంపీగా కొనసాగుతున్న వెంకటస్వామి ఢిల్లీలో తాను నివసిస్తున్న క్వార్టర్‌ను ఆమెకు ఇచ్చారు. అప్పట్నుంచి వెంకటస్వామి నివసించిన 24, అక్బర్‌రోడ్‌ను కాంగ్రెస్(ఐ) పార్టీ ప్రధాన కార్యాలయంగా ఇందిర మార్చారు. నాటి నుంచి ఇందిర సన్నిహితుల్లో కాకా ఒకరిగా మారారు. నేటి వరకు కాంగ్రెస్ కార్యాలయ చిరునామా 24, అక్బర్‌రోడ్ కావడం గమనార్హం.

భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. జవహర్‌లాల్ విధానాలు నచ్చక పోయినా మొరార్జీ దేశాయ్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అసమ్మతి, అసంతృప్తితో రగిలిపోయేవాళ్లు. రుసరుసలతోనే పార్టీలో కొనసాగారు. మొరార్జీని, ఆయన భక్తులను వదిలించుకోవడాని కే నెహ్రూ నాయకత్వం కామరాజ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసింది. పార్టీలో జవహర్‌లాల్‌తో విభేదిస్తున్న వారికి 1962 సెప్టెంబర్‌లో కమ్యూనిస్టు చైనా దురాక్రమణ ఒక అస్త్రంగా మారింది. నెహ్రు చేసింది తప్పు అని ఒక వర్గం. మంచి పని చేశారని మరో వర్గంగా విడిపోయాయి. 1964 మే నెలలో జవహర్‌లాల్ మృతి అనంతరం ప్రధాని పదవికి లాల్‌బహదూర్ శాస్త్రి ఎంపిక జరిగింది. 1966 జనవరిలో లాల్ బహద్దుర్ ఆకస్మిక మరణం తర్వాత ప్రధానిగా ఇందిరాగాంధీ ఎన్నిక అంత సాఫీగా జరగలేదు. అపశ్రుతులు, అసమ్మతి స్వరాలు బాగానే వినిపించాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు

కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఛిద్రాల పర్యవసానం 1967 ఎన్నికలలో కనిపించింది. 1951 తరువాత మొదటిసారి లోకసభలో కాంగ్రెస్ పార్టీ బలం తగ్గింది. ఉత్తరప్రదేశ్ తదితర హిందీ రాష్ట్రాల్లో (గోమండల రాష్ట్రాల్లో) కాంగ్రేసేతర పక్షా ల సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గుత్తాధిపత్యానికి మొదటి దెబ్బ 1957లోనే కేరళలో ఇ.ఎమ్.ఎస్.నంబూద్రి పాద్ నాయకత్వాన వామపక్ష కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో తగిలింది. 1977 లో ఇందిరాగాంధీ ఎమర్జన్సీ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓడిపోయారు. చరణ్ సింగ్ ఉప ప్రధానిగా మురార్జీ క్యాబినెట్ లో ఉన్నారు. ఆ తర్వాత ప్రధాని కావడం కోసం ఇందిరాగాంధీ తోనే ఆయన చేతులు కలిపారు. ఇందిరాగాంధీని జైలుకు పంపడానికి కూడా చరణ్ సింగ్ సిద్దమయ్యారు. 1951లో ఆంద్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నీలం సంజీవరెడ్డి, ఎన్.జి.రంగా పోటీపడ్డారు. నీలం సంజీవరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత రంగాతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చిన ప్రకాశం పంతులు ఇద్దరూ కాంగ్రెస్ ను వీడి వెళ్లిపోయారు. వీరిద్దరు కొంతకాలం ఒక పార్టీగా ఉన్నారు. కానీ వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో చెరో పార్టీ పెట్టుకున్నారు. కృషికార్ లోక్ పార్టీ పేరుతో ఈయన, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ గా ప్రకాశం కొనసాగారు. 1952 ఎన్నికలలో ప్రకాశం పంతులు ఓడిపోయారు. ఆ తర్వాత 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు కమ్యూనిస్టులు అధికారంలోకి రాకుండా చేయడం కోసం జవహర్ లాల్ నెహ్రూ వంటి పెద్దలు ప్రకాశం పంతులును కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చి ముఖ్యమంత్రిని చేశారు. అప్పుడు కె.ఎమ్.పిపి జాతీయ నాయకత్వం ఇందుకు ఒప్పుకోకపోతే, రాష్ట్ర పార్టీ విడిపోయి ప్రకాశంకు మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత కాలంలో ఆయన కాంగ్రెస్ లో కలిసిపోయారు.

ఒకసారి చరిత్ర చూసొద్దామా.. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు!

ఎన్జీ రంగా ఆధ్వర్యంలో కృషికార్ లోక్ పార్టీ, కెఎంపిపి లు 1955 మద్యంతర ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి యునైటెడ్ కాంగ్రెస్ గా పోటీచేశాయి. ఆ తర్వాత రంగా కాంగ్రెస్‌లో కలిశారు. మళ్లీ 1960 నాటికి రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన స్వతంత్ర పార్టీ లో చేరారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ కాంగ్రెస్ చీలికల సమయంలో పాత కాంగ్రెస్‌లో ఉండేవారు. తిరిగి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఐ లో చేరి పోయారు. ఇందిరాగాంధీ మంత్రి పదవి ఇస్తామన్నా తీసుకోని చరిత్ర రంగాది. నీలం సంజీవరెడ్డి పాత కాంగ్రెస్‌లో చాలాకాలం ఉన్నారు. జనతా పార్టీ ఏర్పడడంతో అందులో వీలీనం అయి రాష్ట్రంలో నంద్యాల నుంచి గెలిచిన ఏకైక నేతగా గుర్తింపు పొందారు. తదుపరి స్పీకర్ గా, రాష్ట్రపతి గా పదవులను చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కూడా ఇందిరాగాందీతోపాటు కాంగ్రెస్ ను వదిలి ఆమె పార్టీలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చాలాకాలం ఇందిరాగాందీతోనే రాజకీయంగా కలిసి ఉన్నారు. 1978లో వచ్చిన తేడాతో ఆయన జాతీయస్థాయిలో చీలిన కాంగ్రెస్ (ఆర్) కు అధ్యక్షుడయ్యారు. చివరకు ఆయన కాంగ్రెస్ ఐలోకి వచ్చి ఎమ్.పిగా పోటీచేశారు. మరో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుదీ అదే కధ. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ లో చీలిక రాగా ఇందిరాగాంధీ వెంట వెళ్లలేదు. దాంతో రాజకీయంగా కొంత వెనుకబడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐ లోకి వచ్చి 1984 లో రాజివ్ గాంధీ ప్రధాని అయ్యాక ఆయన మళ్లీ కేంద్రంలో మంత్రి అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కూడా 1959ప్రాంతంలో కొద్ది కాలం డెమొక్రాటిక్ పార్టీని స్థాపించారు. తెలంగాణ ఉద్యమం జరిగిన 1969లో తెలంగాణ ప్రజాసమితి పార్టీకి నాయకత్వం వహించారు. తుదకు కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత ఇందిరాగాందీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఐకి నాయకత్వం వహించి ముఖ్యమంత్రి అయ్యారు. కోట్ల విజయభాస్కరరెడ్డి కూడా కాంగ్రెస్ ఆర్ లో ఉండి తర్వాత కాంగ్రెస్ ఐ లోకి వచ్చారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి అంజయ్య కూడా కొంతకాలం తెలంగాణ ప్రజాసమితి నాయకుడిగా ఉన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి కూడా కాంగ్రెస్ ఆర్ పక్షాన మొదట గెలిచి తర్వాత కాంగ్రెస్ ఐ లో చేరారు. ఒక దశలో ఆయన సొంతంగా ఒక పార్టీ పెట్టాలని అనుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కూడా పాత,కొత్త కాంగ్రెస్ లను చూసినవారే.

కాంగ్రెస్ పార్టీని చీల్చినా చివరకు వైరి వర్గాన్నితమవైపు తిప్పుకోవడంలో ఇందిరాగాంధీ విజయం సాధించారనే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి దైర్యం చేసే తెగువ మిగతా వారికి లేదనేది నిజం.

Show Full Article
Print Article
Next Story
More Stories