TOP 6 News @ 6 PM: టాలీవుడ్ ప్రముఖులపై సీఎం రేవంత్ రెడ్డి గరం గరం స్పీచ్ ఫుల్ వీడియో

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Dec 2024 6:20 PM IST
TOP 6 News @ 6 PM: టాలీవుడ్ ప్రముఖులపై సీఎం రేవంత్ రెడ్డి గరం గరం స్పీచ్ ఫుల్ వీడియో
X

1) CM Revanth Reddy lashes out at Allu Arjun: CM Revanth Reddy Comments On Allu Arjun: సంధ్య థియేటర్ కు రావొద్దని అల్లు అర్జున్ కు పోలీసులు సూచించినా ఆయన వచ్చారని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఘటనలో ఆయన బాధ్యత లేకుండా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. సంధ్య థియేటర్ కు హీరో, హీరోయిన్, సినిమా యూనిట్ కు పోలీసులు సమాచారం ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా హీరో అల్లు అర్జున్ సినిమా థియేటర్ కు వచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు.

20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను కానీ, ఆ కుటుంబాన్ని సినీ ప్రముఖులు ఎవరైనా పరామర్శించారా అని ఆయన ప్రశ్నించారు. అల్లు అర్జున్ కు కన్ను పోయిందా,కాలు పోయిందా ఒక్క పూట జైల్లో ఉన్నారని ఆయనను సినీ ప్రముఖులు పరామర్శించారు. చావు బతుకుల మధ్య ఆ చిన్నారిని పరామర్శించారా.... ఆ కుటుంబం గురించి పట్టించుకున్నారా అని ఆయన అడిగారు. ఈ విషయంలో తమ విధులు నిర్వహించిన పోలీసులను, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని తనపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా దూషించారని రేవంత్ రెడ్డి చెప్పారు.

2) AP Fibernet Notices to RGV: రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

రామ్ గోపాల్ వర్మకు (Ram Gopal Varma)ఏపీ ఫైబర్ నెట్ (AP Fibernet) నుంచి శనివారం నోటీసులు పంపారు. వ్యూహం(Vyooham) సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు లబ్ది పొందారని రామ్ గోపాల్ వర్మతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండీ సహా ఐదుగురికి నోటీసులు పంపారు. రూ.2.15 కోట్ల ఒప్పందం చేసుకొని రూ. 1.15 కోట్ల చెల్లింపులపై నోటీసులు ఇచ్చామని ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ జీవీ రెడ్డి చెప్పారు. వ్యూస్ ప్రకారం డబ్బు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని.. వ్యూహం సినిమాకు 1,863 వ్యూస్ మాత్రమే వచ్చాయని ఆయన తెలిపారు.

ఒక్క వ్యూకు రూ. 11 వేల చొప్పున చెల్లించారని జీవీ రెడ్డి చెప్పారు. దీనిపై వివరణ కోరుతూ రామ్ గోపాల్ వర్మకు లీగల్ నోటీసు పంపామన్నారు. లబ్ది పొందిన మొత్తాన్ని 15 రోజులుగా వడ్డీతో సహా కట్టాలని ఆదేశించారు.2024 మార్చిలో వ్యూహం సినిమా విడుదలైంది. ఏపీ ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో తమపై అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయని అప్పట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోర్టును ఆశ్రయించారు.

3) AP Rain Updates: కొనసాగుతున్న వాయుగుండం ఏపీకి వర్ష సూచన

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప పీడనం గంటకు 12 కిమీ వేగంతో ఈశాన్య దిశగా కదులుతోంది. ఈ వాయుగుండం ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఈ వాయుగుండం బంగాళాఖాతంలో విశాఖపట్నానికి ఆగ్నేయంగా 430 కిమీ దూరంలో, చెన్నైకి ఈశాన్యంగా 480 కిమీ, గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 590 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

4) Delhi Liquor Scam: అరవింద్ కేజ్రీవాల్ విచారణకు ఈడీకి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి అనుమతి

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను దిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Policy) విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీగే సక్సేనా (VK Saxena) శనివారం అనుమతి ఇచ్చారు. లిక్కర్ పాలసీ రూపొందించడంలో అమలు చేయడంలో అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. దీనిపై కేజ్రీవాల్ ప్రాసిక్యూటర్ చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ను ఎన్‌ఫోర్స్ మెంట్ (Enforcement Directorate) ఈ నెల 5న కోరింది. ఈడీ వినతికి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఇచ్చారు.

ఈ మేరకు డిసెంబర్ 21న అనుమతిని ఇచ్చినట్టు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ ను 2024 మార్చి 21న దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ద్వారా వచ్చిన రూ. 45 కోట్లను గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.

5) రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్స్ ఎటాక్

రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ దూకుడు పెంచింది. రష్యాలోని కజాన్ సిటీపై ఉక్రెయిన్ డ్రోన్స్ ఎటాక్స్ జరిపింది. శనివారం ఉదయం జరిగిన ఈ డ్రోన్ ఎటాక్స్ లో నివాసిత భవనాలు దెబ్బతిన్నాయి. టాటార్‌స్థాన్‌ రీజియన్‌లోని కజాన్ సిటీపై జరిగిన ఈ డ్రోన్ దాడులపై అక్కడి గవర్నర్ రుస్తం మిన్నిఖనోవ్ స్పందించారు. మొత్తం 8 డ్రోన్ దాడులు జరగ్గా అందులో ఆరు డ్రోన్స్ నివాస సముదాయాలను ఢీకొన్నట్లు చెప్పారు. మరో డ్రోన్ పారిశ్రామిక భవనాన్ని తాకిందన్నారు. ఇంకో డ్రోన్‌ను నదిపై కూల్చేసినట్టు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story