ప్రాజెక్టులకు నిధులివ్వమని కేంద్రాన్ని కోరిన సీఎం చంద్రబాబు


రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో పాటిల్ను కలిసి సీఎం చంద్రబాబు పలు విజ్ఞప్తులు చేశారు.
న్యూఢిల్లీ: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో పాటిల్ను కలిసి సీఎం చంద్రబాబు పలు విజ్ఞప్తులు చేశారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్కు నీటి భద్రత అత్యంత కీలక అంశమని, రాష్ట్రంలో సాగునీటి-తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులపై కేంద్ర–రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఉందన్నారు.
జల్ జీవన్ మిషన్ :
2025-26 ఆర్ధిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని విన్నవించారు. జల్ జీవన్ మిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.524.41 కోట్లు ఖర్చు చేశామని, అలాగే దీనికి సంబంధించిన కేంద్ర వాటా నిధులను కూడా విడుదల చేయాలని సీఎం కోరారు.
PMKSY – RRR పథకం: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) – RRR పథకం కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని పాటిల్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు.
ఈ పథకానికి సంబంధించి కేంద్రం వాటా నిధులు వెంటనే విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ : పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండింగులో ఉన్న అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. రెండో దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై త్వరలోనే పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు.
వంశధార నది వివాద ట్రిబ్యునల్ (VWDT): వంశధార నది వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగడం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యవసరమని తెలిపారు. దీనికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలగకుండా, ట్రిబ్యునల్ నిర్ణయాల అమలుకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై తక్షణమే కేంద్ర జోక్యం చేసుకోవాలన్నారు.
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు అంశం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచాలని భావిస్తోందని, దీనికి సంబంధించి భూసేకరణకు కూడా సిద్ధమైందని సీఎం అన్నారు. అయితే, ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున కర్నాటక ప్రభుత్వం దీనిపై ముందుకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం నిలువరించాలని పాటిల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



