కేరళలో లవ్ జిహాద్ కలకలం.. సెక్స్ బానిసలుగా కేరళ యువతుల విక్రయం

కేరళలో లవ్ జిహాద్ కలకలం.. సెక్స్ బానిసలుగా కేరళ యువతుల విక్రయం
x
కేరళలో లవ్ జిహాద్ కలకలం
Highlights

ఓ పదేళ్ళ నుంచి కేరళలో లవ్ జిహాద్ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా సిరో మలబార్ కేథలిక్ చర్చి అధికారికంగానే ఈ లవ్ జిహాద్ పై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ...

ఓ పదేళ్ళ నుంచి కేరళలో లవ్ జిహాద్ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా సిరో మలబార్ కేథలిక్ చర్చి అధికారికంగానే ఈ లవ్ జిహాద్ పై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. దేశంలో కొన్ని దశాబ్దాలుగా లవ్ జిహాద్ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మొదట్లో పదుల సంఖ్యలో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు వేల సంఖ్యలోకి చేరుకుంటున్నాయి. అసలు ఈ లవ్ జిహాద్ ఏంటో చూద్దాం.

కేరళలో లవ్ జిహాద్ పై ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. ఓ పది, ఇరవై ఏళ్లుగా ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కేరళలో అతి పెద్ద చర్చి అయిన సిరో మలబార్ చర్చి సైతం అధికారికంగానే ఈ ఆరోపణలు చేసింది. ఐసిస్ ఉగ్రవాదులు ప్రేమ పేరిట క్రైస్తవ యువతుల్ని ఆకర్షించి మతం మారస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు ప్రేమ పేరిట లేదంటే బ్లాక్ మెయిల్ చేసి క్రైస్తవ యువతుల్ని విదేశాలకు తీసుకెళ్ళి సెక్స్ బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించింది. లవ్ జిహాద్ విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును కూడా చర్చి విమర్శించింది.

చర్చి బిషప్ లు అంతా సమావేశమయ్యే కీలక సమావేశం సినద్ లో లవ్ జిహాద్ అంశం చర్చకు వచ్చింది. కార్డినల్ జార్జ్ అలెన్ చెర్రీ సారథ్యంలో ఈ సమావేశం జరిగింది. కేరళలో లౌకికవాదానికి, సామాజిక శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందని చర్చి ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. క్రైస్తవ యువతులను లక్ష్యంగా చేసుకొని ఒక ప్లాన్ ప్రకారమే లవ్ జిహాద్ జరుగుతోందని చర్చి ఆరోపించింది. పోలీసుల కథనం ప్రకారమే 21 మంది యువతులు ఐసిస్ లో చేరగా అందులో సగానికి పైగా క్రైస్తవ యువతులే కావడం గమనార్హం. మరెంతో మంది యువతులను లవ్ జిహాద్ పేరిట ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగం చేస్తున్నారని చర్చి ఆరోపించింది. మతపరమైన అంశంగా కాకుండా శాంతిభద్రతల అంశంగా దీన్ని పరిగణించాలని పోలీసులను చర్చి కోరింది.

కొంత మంది యువతులకు వారికి తెలియకుండానే డ్రగ్స్ ఇచ్చి, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది కేరళలో ఈ తరహాలో రెండు కేసులు కూడా నమోదయ్యాయి. పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు కూడా లవ్ జిహాద్ కేసులను విచారించింది. యువతులకు మైనారిటీ తీరిన నేపథ్యంలో వారి అభిప్రాయాలను మన్నించింది. ఆయా మతాంతర వివాహాలు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. కొన్ని కేసుల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా లవ్ జిహాద్ పై దర్యాప్తు చేసింది. తాజా ఉదంతంలో పలు హిందూ సంఘాలు సైతం క్రైస్తవ సంఘాలకు తమ మద్దతు ప్రకటించాయి. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అవి డిమాండ్ చేస్తున్నాయి. 2005- 2012 మధ్య కాలంలో దేశంలో ఒక్క కేరళలోనే నాలుగు వేల దాకా లవ్ జిహాద్ కేసులు నమోదయ్యాయి. పొరుగునే ఉన్న కర్నాటకలోనూ వేల సంఖ్యలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ లో సైతం లవ్ జిహాద్ సంఘటనలు వెలుగు చూశాయి. తన కుమార్తె సైతం లవ్ జిహాద్ బాధితురాలిగా మారిందంటూ ఇటీవల మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ ఆరోపించడం సంచలనం కలిగించింది.

తాను ప్రేమించిన ఓ యువకుడు ఇస్లాం మతం స్వీకరించాల్సిందిగా బలవంతం చేస్తున్నాడని కేరళలో ఓ క్రైస్తవ యువతి ఆరోపించింది. తనను లైంగిక వేధింపులకు గురిచేసి బ్లాక్ మెయిల్‌ కూడా చేస్తున్నాడని చెబుతూ ఆ యువతి తన ఆవేదన బయటపెట్టింది. దీంతో చర్చి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే చర్చి పలు చోట్ల క్రైస్తవ అమ్మాయిలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జీహాదీల ట్రాప్‌లో పడకూడదంటూ హిత బోధ చేస్తోంది. మరో వైపున పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మాత్రం లవ్ జిహాద్ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను పక్కదోవ పట్టించేందుకే తాజాగా తెరపైకి లవ్ జిహాద్ ను తెస్తున్నారంటూ విమర్శించింది. అయితే కేరళ చర్చి లవ్ జిహాద్ ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఎన్నో సార్లు కూడా చర్చి తన ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు భారీస్థాయిలో బహిరంగంగా ముందుకు వచ్చింది.

లవ్ జిహాద్ పై దేశంలో ఇప్పటికే వందలాది కేసులు నమోదయ్యాయి. కాకపోతే అవేవీ కూడా కోర్టుల్లో నిలవడం లేదు. అదే సమయంలో యువతుల్ని బ్లాక్ మెయిల్ చేసి మతం మార్చిన కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే ఒక పథకం ప్రకారమే లవ్ జిహాద్ జరుగుతోందన్న ఆరోపణల్లో కొంత నిజం ఉందనే వాదన వస్తోంది. మహిళలను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించుకోవడం ఓ పదేళ్ళుగా అధికమైపోయింది. అలా మహిళలను రిక్రూట్ చేసుకునేందుకు ప్రేమను ఎరగా వేయడాన్ని మాత్రం సహించలేం. ప్రేమను తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే దురుద్దేశాలతో లొంగదీసుకోవడాన్ని మాత్రం వ్యతిరేకించాల్సిందే. ఇలాంటి సంఘటనలను మతపరంగా మాత్రమే కాకుండా శాంతిభద్రతల అంశంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories