భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్..!

Chandrachud to take oath as next chief justice
x

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్

Highlights

* వ్యక్తిగత స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, వికలాంగుల హక్కులకేసుల్లో తీర్పు

Dr DY Chandra Chud: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉద్ధవ్ ఉమేశ్ లలిత్ నిన్న పదవీ విరమణచేశారు. ఆయన సూచనమేరకు కొలీజియం ప్రతిపాదనలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో సీనియర్ కేటగిరిలో అగ్రస్థానంలో ఉన్న ధనంజయ చంద్రచూడ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, జస్టిస్ చంద్రచూడ్ చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కీలక తీర్పులిచ్చారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై తీర్పునిచ్చి సంచలనం సృష్టించారు. వివాదాస్పదమై అయోధ్య భూ వివాదంపై కీలక తీర్పునిచ్చిన బృందంలోనూ చంద్రచూడ్‌ ఒకరుగా ఉన్నారు. వివాహితులైన ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో ‎శారీరక సంబంధం పెట్టుకోవచ్చిని, కరోనా క్లిష్టపరిస్థితుల్లో వైద్య సాయం నిరాకరించకూడదని వేర్వేరు సందర్భాల్లో కీలక తీర్పులిచ్చారు. మానవహక్కులు, లింగ సమానత్వం, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, క్రిమినల్, రాజ్యాంగ చట్టాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, వికలాంగుల హక్కులు, ఆధార్ కార్డులో వ్యక్తిగత సమాచార గోప్యత, పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల కేసుల్లో కీలక తీర్పులిచ్చారు.

ప్రగతి శీల భావాలున్న ధనుంజయ చంద్రచూడ్ న్యాయవాదుల కుటుంబంనుంచి వచ్చారు. న్యాయవ్యవస్థలో జస్టిస్ చంద్రచూడ్ ఓ అద్భుతమైన రికార్డును సొంతంచేసుకున్నారు. వివాదాస్పదమైన, సంచలన కేసుల్లో తీర్పునిచ్చిన జస్టిస్ చంద్రచూడ్ చరిత్రలో అరుదైన రికార్డును సృష్టించారు. చంద్రచూడ్ తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ గతంతలో 1978లో సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. సుధీర్ఘకాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినవారిలో యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ఒకరుగా నిలిచారు. చరిత్రలో తండ్రీకొడుకులిద్దరూ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన ఘనత చంద్రచూడ్‌కే దక్కుతుంది. జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కార్యనిర్వాహక ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. చంద్ర చూడ్ కుమారులు అభినవ్, చింతన్‌ ఇద్దరూ న్యాయవాదులు సేవలు అందిస్తున్నారు.

ధనుంజయ చంద్రచూడ్ 1959 నవంబరు 11న ముంబైలో జన్మించారు. తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుధీర్ఘకాలం పనిచేశారు. తల్లి ప్రభ, సంగీతంలో కళాకారిణిగా రాణించారు. ముంబయి, ఢిల్లీలో ప్రాధమిక విద్యాభ్యాసం చేశారు. ఉన్నత విద్యాభ్యాసం ఢిల్లీలోనే కొనసాగించారు. ఢిల్లీ యూనివర్శిటీనుంచి న్యాయ విద్యలో పట్టా పొందారు. హార్వర్డ్ యూనివర్శిటీలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు. జ్యుడిషియల్ సైన్సెస్‌లో డాక్టరేట్ సొంతంచేసుకున్నారు.

ముంబయి, ఢిల్లీ హైకోర్టులో 1997 న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధనంజయ చంద్రచూడ్ 1998లో ముంబయి హైకోర్టులో సీనియర్ అడ్వొకేట్‌గా వ్యవహరించారు. అదే సంవత్సరం అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. మహారాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. 2000 మార్చి 29న ముంబై హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయమూర్తిగా మూడేళ్ల ఏడు నెలలు పూర్తి చేసుకున్న తర్వాత అలహాబాద్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మే 13న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తాజాగా సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ పదవిలో మరో రెండేళ్లు కొనసాగుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories