Kerala: కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫీసుపై బాంబు దాడి

Kerala: సీపీఎం కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని.. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల ఆరోపణలు

Rama Rao
Updated on: 12 July 2022 5:30 PM IST
Bomb Attack on RSS office in Kerala | Kerala News
X

Kerala: కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫీసుపై బాంబు దాడి

Kerala: కేరళలోని కన్నూర్ జిల్లాలోని పయ్యన్నూర్ ప్రాంతంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటి గంటా 30 నిమిషాల సమయంలో బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కేవలం ఫర్నీచర్‌ మాత్రమే ధ్వంసమైనట్టు వివరించారు. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. పేలుడు పదార్థాల చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కేరళ పోలీసులు తెలిపారు.

అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంపై సీపీఎం కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని ఆ సంఘానికి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. కేరళలో ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌, సీపీఎం నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జూన్ 30 రాత్రి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంపై దాడి జరిగింది. దానికి ప్రతీకారంగా సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఏకేజీ సెంటర్‌పై కొందరు దుండగులు బాంబులు విసిరారు. ఈ కేసుల్లో ఇప్పటి వరకు నిందితులను పోలీసులు ఇంకా గుర్తించలేదు. ఆ రెండు ఘటనలు జరిగిన 12 రోజులకే తాజాగా కన్నూరు జిల్లాలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంపై దాడి జరిగింది. పార్టీ కార్యాలయంపై బాంబు దాడికి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నిరసనలను చేపట్టాలని ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story