కేంద్ర మంత్రివర్గంలో ఏపీలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరవచ్చనే ఊహాగానాల మధ్య, పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర...
కేంద్ర మంత్రివర్గంలో ఏపీలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరవచ్చనే ఊహాగానాల మధ్య, పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో శుక్రవారం రాత్రి సమావేశం అయ్యారు. 40 నిమిషాల పాటు సాగిన వీరి భేటీలో పెండింగ్ సమస్యలు, దిశ బిల్లుకు చట్టబద్ధత, వికేంద్రీకరణ, మండలి రద్దు సహా పలు అంశాలపై అమిత్ షాతో సీఎం జగన్ చర్చించినట్టు తెలుస్తోంది.
అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించేలా కోరినట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేస్తామని జగన్ వివరించారు. అయితే.. ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ. 3,320 కోట్లు కేంద్రంనుంచి రావాల్సి ఉందన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 838 కోట్లు ఆదా చేశామని అమిత్ షాకి వివరించినట్టు సమాచారం.
రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతిగా ప్రణాళిక వేసుకున్నామని.. ఈ క్రమంలో హైకోర్టును కర్నూలు తరలించడానికి కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇచ్చేలా కృషి చెయ్యాలని కోరినట్టు తెలుస్తోంది. అలాగే రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్నీ గుర్తుచేశారు.
ఇక గ్రాంట్ల రూపంలో వెనకబడ్డ జిల్లాలకు 1050 కోట్లు మాత్రమే వచ్చాయని..గత మూడేళ్లనుంచి నిధులు రాలేదన్నారు. రెవిన్యూ లోటును భర్తీచేస్తామంటూ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. దీన్ని పార్లమెంటు కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. 2014–15 నాటికి ఈ రెవిన్యూ లోటును రూ. 22,949 గా కాగ్ నిర్ధారించింది. ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉందని అమిత్ షా కు తెలియజేశారు.
మరోవైపు ప్రముఖ వ్యక్తి వ్యక్తిగత కార్యదర్శి తోపాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని మూడు సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ జరిపిన శోధనల నేపథ్యంలో అమిత్ షాతో జగన్ సమావేశం కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. 40 చోట్ల జరిపిన శోధనలో రూ .2,000 కోట్ల లెక్కలు లేని లావాదేవీలు జరిగినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలావుంటే వైసీపీ కేంద్ర క్యాబినెట్ లో చేరవచ్చు అనే ఊహాగానాలు పెద్దఎత్తున వచ్చాయి.. అమిత్ షా, జగన్ భేటీలో అసలీ ప్రస్తావనే రాలేదని తెలుస్తోంది. పొత్తుపై ఇటు వైసీపీ కానీ.. అటు బీజేపీ కానీ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. పైగా వైసీపీ నేతలు ఈ విషయాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నారు. తాము ఎన్డీఏలో చేరడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే క్రమంలో ఏపీ ప్రజలకు ఏది అవసరమో అది చేస్తామని వెల్లడించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire