75th Independence Day: 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఉన్నత స్థాయి జాతీయ కమిటి

75th Independence Day: తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు రామోజీరావు, కృష్ణ ఎల్ల వంటి మరికొందరికి చోటు.

Kranthi
Updated on: 6 March 2021 10:51 AM IST
259 Member Panel Constituted to Commemorate 75 Years of Indias Independence
X

ఫైల్ ఇమేజ్


75th Independence Day: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. 259 మంది ప్రముఖులు వున్న ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్య సేన్‌, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌, బిజెపి నేత ఎల్ కె అద్వానీ, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, ప్రముఖ గాయని లతా మంగేష్కర్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు దాదాపు అందరు కేంద్ర మంత్రలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, త్రివిధ దళాధిపతులు, లోక్‌సభ, రాజ్యసభల్లో వివిధ పక్షాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు స్థానం కల్పించారు. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రుల హోదాలో కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ హోదాలో బండారు దత్తాత్రేయ, రాజకీయ పార్టీల నుంచి చంద్రబాబు నాయుడు, సీతారాం ఏచూరి, విభిన్న రంగాల నుంచి రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా, భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, పుల్లెల గోపీచంద్‌, పీవీ సింధు, మిథాలీరాజ్‌లకు స్థానం దక్కింది. సినిమా రంగ ప్రముఖులు ఏఆర్‌ రెహమాన్‌, రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌, ఇళయరాజా, కేజే ఏసుదాస్‌లూ ఇందులో సభ్యులుగా నియమితులయ్యారు.

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఈనెల 8న జరిగే ఈ కమిటీకి కేంద్ర సాంస్కృతికశాఖ కార్యదర్శి రాఘవేంద్రసింగ్‌ సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారు. తక్షణం ఈ కమిటీ అమల్లోకి వచ్చినట్లేనని కేంద్రం వెల్లడించింది.

Kranthi

Kranthi

Next Story