Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం... 12 మంది మృతి

Heavy Rains: అకస్మిక వరదలతో భయాందోళనలో ప్రజలు

Jyothi
Published on: 9 July 2023 7:31 PM IST
12 people died in Northern States Due to Heavy Rains
X

Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం... 12 మంది మృతి

Heavy Rains: నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెతుతున్నాయి. ఢిల్లీని కుంభవృష్టి అతలాకుతలం చేసింది. ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్ ప్రాంతంలో 153 మీల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. 41 ఏళ్ల తరువాత హస్తినలో ఈ స్థాయిలో వర్షం పడడం ఇదే ప్రథమం.

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలకు దోడా ప్రాంతంలో కొండచరియలు బస్సుపై పడగా, ఇద్దరు మృతి చెందారు. పూంచ్ సెక్టార్ లోనూ విషాదం నెలకొంది. హఠాత్తుగా వరద నీరు దూసుకురావడంతో ఇద్దరు జవాన్లు గల్లంతయ్యారు. వీరి మృతదేహాలు నేడు లభ్యమయ్యాయి.

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వర్షబీభత్సం నెలకొంది. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలకు గంగా నది ప్రమాదకర రీతిలో ప్రవహిస్తోంది. గంగా నదిలో ఓ కారు పడిపోయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది..

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. పర్యాటక ప్రదేశం మనాలీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడి వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. మండీ జిల్లాలోని బియాస్ నదిపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. వరద నీటిలో పంచవక్త్ర ఆలయం మునిగింది. షిమ్లా, కల్కా రూట్‌లో పలు రైళ్లను నిలిపివేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని 700 రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు రెండ్రోజులు పాటు సెలవులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్‌లో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ చెబుతోంది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ..ప్రజలు అప్రమత్తంగా సూచించింది.

Jyothi

Jyothi

Next Story