
Narasimha 2: రజనీకాంత్ సంచలన ప్రకటన..నరసింహ సీక్వెల్ కు ప్లాన్.. ఈసారి విలన్ నీలాంబరి పాత్రే మెయిన్
సూపర్స్టార్ రజనీకాంత్ తన కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఇచ్చారు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులలో చెరగని ముద్ర వేశాయి.
Narasimha 2: సూపర్స్టార్ రజనీకాంత్ తన కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఇచ్చారు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులలో చెరగని ముద్ర వేశాయి. అలాంటి వాటిలో ఒకటి నరసింహా. రజనీకాంత్ తన స్వాగ్, స్టైల్తో ప్రేక్షకులను అద్భుతంగా ఆకర్షించిన ఈ సినిమాలో విలన్ పాత్ర నీలాంబరి (రమ్యకృష్ణ)కి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. 1999 లో తొలిసారి విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత, డిసెంబర్ 12 న మళ్లీ థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా రజనీకాంత్ ఒక వీడియోను విడుదల చేసి, ఈ సినిమాకు సంబంధించిన పాత జ్ఞాపకాలను, సీక్వెల్ ప్లాన్ను వెల్లడించారు.
రీ-రిలీజ్ గురించి మాట్లాడిన రజనీకాంత్, నరసింహా సినిమాను తాను వేరే వారి పేరు మీద నిర్మాణం చేశానని చెప్పారు. ఈ సినిమా హక్కులు ప్రస్తుతం సన్ సంస్థ వద్ద మాత్రమే ఉన్నాయని, ఆ హక్కులు వారి వద్దే ఉండాలని, ఈ సినిమాను ప్రజలు థియేటర్లలోనే చూడాలనేది తన కోరిక అని రజనీకాంత్ తెలిపారు. 1999 లో వచ్చిన ఒరిజినల్ నరసింహా సినిమాకు కథ రాసింది కూడా రజనీకాంత్ కావడం విశేషం.
నరసింహా షూటింగ్ గురించి రజనీకాంత్ మాట్లాడుతూ.. సినిమాలో విలన్ పాత్రకు మహిళను ఎంపిక చేయాలనే ఆలోచన చాలా కొత్తగా అనిపించిందని చెప్పారు. ఆ విలన్ పాత్ర నీలాంబరి కోసం మొదట తాము ఐశ్వర్య రాయ్ ను సంప్రదించడానికి చాలా కష్టపడ్డామని గుర్తు చేసుకున్నారు. అయితే అప్పట్లో ఐశ్వర్య రాయ్ ఆసక్తి చూపలేదని రజనీకాంత్ తెలిపారు. ఒకవేళ ఆమె ఆసక్తి చూపించి ఉంటే, ఆమె కోసం రెండు, మూడు సంవత్సరాలు అయినా వేచి ఉండటానికి తాను సిద్ధంగా ఉన్నానని రజనీకాంత్ అన్నారు. ఐశ్వర్య రాయ్ తర్వాత శ్రీదేవి లేదా మాధురీ దీక్షిత్ లను కూడా తీసుకోవాలని అనుకున్నామని, కానీ వారు ఈ పాత్రకు సరిపోరనిపించిందని చెప్పారు. చివరకు దర్శకుడు కె.ఎస్.రవికుమార్ సలహా మేరకు రమ్యకృష్ణను నీలాంబరి పాత్రకు ఖరారు చేశామని ఆయన పాత విషయాలను గుర్తు చేసుకున్నారు.
నరసింహా సినిమాకు మహిళలు గేట్లు తోసుకుని థియేటర్లకు వచ్చారని, తన కెరీర్లోనే అలా జరగడం అదే మొదటిసారని రజనీకాంత్ చెప్పారు. ఆ సినిమాలోని నీలాంబరి పాత్ర వారికి చాలా బాగా నచ్చిందని, ఆ పాత్రకు రమ్యకృష్ణ ప్రాణం పోశారని ఆయన ప్రశంసించారు. ఇప్పుడు 'రోబో 2', 'జైలర్ 2' వంటి సీక్వెల్స్ వస్తున్నప్పుడు, మనం ఎందుకు నరసింహా 2 చేయకూడదు అనే ఆలోచన తనకు వచ్చిందని రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. ఈసారి నీలాంబరి పాత్రనే ప్రధానంగా ఉంచి నీలాంబరి: నరసింహా' అనే పేరుతో సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు, కథను తానే రాస్తున్నట్లు రజనీకాంత్ ప్రకటించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




