Karisma Kapoor : కూతురు ఫీజు కట్టడానికి కూడా డబ్బుల్లేవు.. మెలోడ్రామాలొద్దు అంటూ కరిష్మాపై కోర్టు అసహనం

Karisma Kapoor : భారతీయ సినీ ప్రపంచంలో కపూర్ కుటుంబానికి ఎంత పెద్ద చరిత్ర ఉందో అందరికీ తెలిసిందే.

CR Reddy
Published on: 16 Nov 2025 1:00 PM IST
Karisma Kapoor
X

Karisma Kapoor : కూతురు ఫీజు కట్టడానికి కూడా డబ్బుల్లేవు.. మెలోడ్రామాలొద్దు అంటూ కరిష్మాపై కోర్టు అసహనం

Karisma Kapoor : భారతీయ సినీ ప్రపంచంలో కపూర్ కుటుంబానికి ఎంత పెద్ద చరిత్ర ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి గొప్ప సినీ కుటుంబానికి చెందిన ప్రముఖ నటి కరిష్మా కపూర్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, తన కూతురు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవని కోర్టులో చెప్పడం సినీ అభిమానులను ఆశ్చర్యపరిచింది. 90లలో బాలీవుడ్‌ను ఏలిన ఈ నటి, ఇప్పుడు తన సొంత ఆర్థిక పరిస్థితి గురించి కోర్టులో చేసిన షాకింగ్ ప్రకటన వివరాలు చూద్దాం.

బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన కరిష్మా కపూర్, తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు ఢిల్లీ హైకోర్టులో వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. "నా కూతురు అమెరికాలో చదువుతోంది. నేను ఆమె స్కూల్ ఫీజును రెండు నెలలుగా కట్టలేకపోతున్నాను. నా దగ్గర డబ్బులు లేవు" అని న్యాయమూర్తులకు విన్నవించారు. కపూర్ కుటుంబం దేశంలోనే అత్యంత శ్రీమంతులలో ఒకటిగా ఉన్నప్పటికీ, కరిష్మా వ్యక్తిగతంగా ఈ పరిస్థితి ఎదుర్కోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

కరిష్మా కపూర్ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ను వివాహం చేసుకున్నారు. 2016లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో సంజయ్ తనపై దారుణంగా ప్రవర్తించారని కరిష్మా ఆరోపించారు. 2025లో సంజయ్ కపూర్ ప్రమాదవశాత్తు మరణించారు. అప్పటి నుంచి సంజయ్ కపూర్ ఆస్తి, విడాకుల సమయంలో నిర్ణయించిన భరణం విషయమై చట్టపరమైన వివాదాలు నడుస్తున్నాయి.

ఈ ఆస్తి వివాదం కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణలో ఉంది. కేసును త్వరగా పరిష్కరించాలని కోరుతూ, కరిష్మా తన కూతురు ఫీజు కట్టలేని పరిస్థితిని కోర్టుకు వివరించారు. దీనిపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టులో ఈ విధమైన మెలోడ్రామాకు తావు లేదని, చట్టబద్ధంగా వాదనలు వినిపించాలని ఖండించారు. కేసు తదుపరి విచారణను నవంబర్ 19కి వాయిదా వేశారు.

సంజయ్ కపూర్ మరణానంతరం, ఆయన ఆస్తి హక్కుదారులుగా ఆయన మూడవ భార్య ప్రియా సచ్‌దేవ్ ఉన్నారు. అయితే, సంజయ్ రాసిన వీలునామాను ప్రియా సచ్‌దేవ్ తారుమారు చేశారని కరిష్మాతో సహా మరికొందరు కోర్టులో ఆరోపించారు. ఈ వివాదం కారణంగానే కరిష్మాకు సంబంధించిన భరణం, ఆస్తి వివాదాలు ఇంకా కోర్టులోనే నలుగుతున్నాయి.

CR Reddy

CR Reddy

Next Story