War 2 : వాళ్లు ఉన్నంతకాలం నన్నెవరూ ఆపలేరు.. వార్ 2 వేదికపై ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ వెనుక ఉన్నదెవరు


War 2 : వాళ్లు ఉన్నంతకాలం నన్నెవరూ ఆపలేరు.. వార్ 2 వేదికపై ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ వెనుక ఉన్నదెవరు
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం వార్ 2. ఈ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో హైదరాబాదులో ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 10న ఘనంగా జరిగింది.
War 2 : హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం వార్ 2. ఈ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో హైదరాబాదులో ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 10న ఘనంగా జరిగింది. ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వేదికపై ఎన్టీఆర్ చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్, ముఖ్యంగా తాత నందమూరి తారక రామారావు, హృతిక్ రోషన్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి.
హైదరాబాదులో జరిగిన ఈవెంట్లో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్, తన అభిమానుల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. "నాపై ఎన్టీఆర్ ఆశీర్వాదం ఉన్నంతవరకు, నన్ను ఎవరూ ఆపలేరు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నో చర్చలకు దారితీశాయి. ప్రస్తుతం నందమూరి కుటుంబంలో అంతా సవ్యంగా లేదనే వార్తలు వస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయన తన తండ్రి, తల్లి, అన్నదమ్ములను గుర్తు చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఆయన ప్రసంగంలో నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు పేర్లను మాత్రం ప్రస్తావించలేదు.
జూనియర్ ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ గురించి మాట్లాడిన మాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. “నా కెరీర్, హృతిక్ కెరీర్ దాదాపు ఒకే సమయంలో ప్రారంభమయ్యాయి. హృతిక్ను చూసే ముందు నేను మైఖేల్ జాక్సన్ అభిమానిని. కానీ, హృతిక్ను చూసిన తర్వాత ఆయనలా డ్యాన్స్ చేయాలని ఆశపడ్డాను" అని అన్నారు. వార్ 2లో ఇద్దరి మధ్య డ్యాన్స్ ఫైట్ జరిగిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. హృతిక్ రోషన్ ఈ దేశంలోనే గొప్ప డ్యాన్సర్ అంటూ ఆయనను పొగిడారు.
హృతిక్ ఒక పర్ఫెక్షనిస్ట్ అని, సెట్స్కి ప్రతిసారి ఒక కొత్త విద్యార్థిలా వస్తారని, ఆయన నుండి ఎన్నో నేర్చుకున్నానని ఎన్టీఆర్ తెలిపారు. హృతిక్ గొప్ప నటుడు, డ్యాన్సర్ మాత్రమే కాకుండా మానవత్వం ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు. వార్ 2 తన మొదటి బాలీవుడ్ చిత్రం అయితే, ఇది హృతిక్ రోషన్కు మొదటి తెలుగు చిత్రమని, తెలుగు ప్రేక్షకులు ఆయనను ఎప్పటికీ తమ హృదయాల్లో పెట్టుకుంటారని అన్నారు.
ఈవెంట్లో పాల్గొన్న అభిమానులనుద్దేశించి ఎన్టీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. “నా మొదటి సినిమా విడుదల కాకముందే అధోనీకి చెందిన ముజీబ్ అనే వ్యక్తి నా అభిమానిగా మారాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అభిమానులు పెరుగుతూ ఇప్పుడు కోట్లాది మంది అయ్యారు. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు, కానీ నా జీవితం, నా ప్రాణం మీకే అంకితం” అని భావోద్వేగంగా చెప్పారు. అలాగే, సినిమాలోని ట్విస్ట్లను ఎవరూ బయట పెట్టవద్దని ప్రేక్షకులను కోరారు. తన ప్రసంగాన్ని జై ఎన్టీఆర్-జై హరికృష్ణ అంటూ ముగించారు. భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులకు భద్రత కల్పించడానికి పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



