Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు పాన్ ఇండియా లెవల్లో దుమ్ము రేపుతుంది.. ఏ.ఎం. రత్నం


Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాపై ఎ.ఎం. రత్నం ఫిబ్రవరి 4న తన పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ను అలరించడం పక్కా అని అని అన్నారు. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఏ.ఎం. రత్నం చేసిన ఈ వ్యాఖ్యలతో హరిహర వీరమల్లు సినిమాపై ఇప్పుడున్న హైప్ కంటే మరిన్ని రెట్లు పెరిగింది.
అసలే పవన్ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వారి అభిమానులకు ఏ.ఎం.రత్నం మాటలు మంచి ఎనర్జీని ఇచ్చాయి. ఇక సినిమా ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తవుతుందా.. ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆశగా చూస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రూ.200 కోట్లతో హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేసేందుకు సిద్దం చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి కాగా మిగిలిన పార్ట్ని ఎ.ఎం.రత్నం కొడుకు ఎ.ఎం.జ్యోతి కృష్ణ పూర్తి చేస్తున్నాడు. పవన్ చివరిగా 2023లో బ్రో సినిమాతో ప్రేక్షకులను అలరించారు. దాదాపు రెండేళ్లు తర్వాత హరిహర వీరమల్లుతో వెండితెరపై అలరించడానికి సిద్దమవుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది పవన్ మొదటి సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఇక ఏ.ఎం.రత్నం విషయానికొస్తే... ఆయన కేవలం నిర్మాతగానే కాకుండా రచయితగా, డైరెక్టర్గా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలల్లో తనదైన ముద్ర వేశారు. ఎ.ఎం.రత్నం 1953 ఫిబ్రవరి 4న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో జన్మించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ భారతీయ సినీ దిగ్గజాలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మేకప్ మ్యాన్గా సినీ కెరీర్ ప్రారంభించి.. కర్తవ్యం సినిమాతో నిర్మాతగా మారారు.
కుటుంబ విలువలు, ఐక్యత గురించి చెప్పే పెద్దరికం, సంకల్పం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా పలు సినిమాలను నిర్మించారు. ఏ.ఆర్. రెహమాన్, శంకర్ వంటి భారతీయ సినిమా దిగ్గజాలతో పలు చిత్రాలకు కలిసి పనిచేశారు. స్నేహం కోసం చిత్రానికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేశారు. ఎన్నో గొప్ప చిత్రాలను అందించిన ఏ.ఎం.రత్నం మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, రెండు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతో పాటు మరెన్నో ప్రశంసలను గెలుచుకున్నారు.
పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న హరిహర వీరమల్లు.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయం సాధిస్తుందని ఎ.ఎం.రత్నం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే గొప్ప చిత్రంగా హరిహర వీరమల్లు నిలుస్తుందని అన్నారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire