Air Pollution: కాలుష్యం మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.? అధ్యయనంలో షాకింగ్ విషయాలు..!

Air Pollution: వాయు కాలుష్యానికి ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ అవుతున్నారా.? కేవలం 60 నిమిషాలు కాలుష్యానికి గురైనా.. మీ మెదడు పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని మీకు తెలుసా.?

Mokshith
Published on: 22 Feb 2025 1:52 PM IST
How Air Pollution Affects Your Brain Shocking Study Reveals Alarming Facts
X

Air Pollution: కాలుష్యం మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.? అధ్యయనంలో షాకింగ్ విషయాలు..!

Air Pollution: వాయు కాలుష్యానికి ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ అవుతున్నారా.? కేవలం 60 నిమిషాలు కాలుష్యానికి గురైనా.. మీ మెదడు పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని మీకు తెలుసా.? ఇదేదో సరదాగా చెప్తోన్న విషయం కాదు. తాజాగా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలిన సంచలన విషయాలు. బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం, మాంచెస్టర్ విశ్వవిద్యాలయం పరిశోధకుల నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

గాలి కాలుష్యంలో ఉండే సూక్ష్మ కణాలు మన మెదడుపై ప్రభావం చూపిస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది. దీని వల్ల దృష్టి కేంద్రీకరణలో సమస్యలు, పూర్తిస్థాయి పరధ్యానం కోల్పోవడం, ఇతర మానసిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. అధ్యయనంలో వెల్లడైన వివరాలను నేచర్‌ కమ్యూనికేషన్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఇందుకోసం పరిశోధకులు 19 నుంచి 67 సంవత్సరాల మధ్య వయస్సు గల 26 మంది వ్యక్తులను నాలుగు వేర్వేరు సెషన్లకు హాజరయ్యేలా చేశారు.

ప్రయోగశాలలో, కొవ్వొత్తులను కాల్చడం ద్వారా నియంత్రిత కాలుష్య వాతావరణాన్ని రూపొందించారు. ఇది పట్టణ కాలుష్యంలో ఉండే సూక్ష్మ కణాలను ఉత్పత్తి చేసింది. కొంతమంది ముక్కు క్లిప్‌లు ధరించి నోటి ద్వారా గాలి పీల్చగా, మరికొందరు ముక్కు ద్వారా గాలి పీల్చారు. అధ్యయన ఫలితాల ప్రకారం, కలుషిత గాలిలో కేవలం 60 నిమిషాలు గడిపిన వారిలో శ్రద్ధ, భావోద్వేగ గుర్తింపు తగ్గిపోవడం గుర్తించారు. అయితే తాత్కాలిక కాలుష్యం జ్ఞాపకశక్తిపై పెద్దగా ప్రభావం చూపించలేదని పరిశోధకులు తెలిపారు.

బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ పోప్ మాట్లాడుతూ. గాలి నాణ్యత బాగాలేకపోతే మేధో వికాసం, ఉత్పాదకత తగ్గిపోతాయని హెచ్చరించారు. మాంచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గోర్డాన్ మెక్‌ఫిగ్గన్స్ ప్రకారం, వాయు కాలుష్యం మెదడుపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ప్రజలు కూడా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఇందుకోసం కాలుష్య స్థాయి అధికంగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం తగ్గించాలి. ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌ను ఉపయోగించాలి. బయటకు వెళ్తే కచ్చితంగా మాస్క్‌లను ధరించాలని సూచిస్తున్నారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story