
Mohan Babu: మోహన్ బాబుకు సుప్రీం షాక్.. విచారణకు హాజరుకావాల్సిందే అంటూ
ప్రముఖ నటుడు శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
ప్రముఖ నటుడు శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రాథమిక ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉన్న సమయంలో ఆయన చేపట్టిన ధర్నా విషయంలో నమోదైన కేసుపై విచారణకు స్టే ఇవ్వాలంటూ మోహన్ బాబు తిరుపతి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, ఈ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. మే 2న విచారణాధికారి ఎదుట మోహన్ బాబు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలన్న మోహన్ బాబు పక్ష న్యాయవాది అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఈ కేసులో మోహన్ బాబు తరఫున న్యాయవాది వాదిస్తూ, ఆయన ఒక ప్రైవేట్ వ్యక్తి, 75 సంవత్సరాల వయసున్నవారు అని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులపై ఎన్నికల కోడ్ వర్తించదని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో జాప్యం విషయంపై ధర్నా చేయడం ఎంసీసీ ఉల్లంఘన కిందకి రాదని, అయినప్పటికీ పోలీసులు ఎంసీసీ కేసుతో సహా చార్జ్షీట్ దాఖలు చేశారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన సుప్రీంకోర్టు, మోహన్ బాబు తప్పనిసరిగా మే 2న విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.?
2014–2019 మధ్య కాలంలో శ్రీ విద్యానికేతన్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా ఇవ్వలేదంటూ మోహన్ బాబు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంతో ఆయన తన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్తో కలిసి విద్యార్థులతో పాటు తిరుపతి–మదనపల్లె జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో, పోలీసులు మోహన్ బాబు సహా ఇతరులపై కేసు నమోదు చేశారు. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారని, ముందస్తుగా అనుమతి లేకుండా ధర్నా చేపట్టారనీ పోలీసులు పేర్కొన్నారు.
తమ విద్యా సంస్థకు ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనట్లు మోహన్ బాబు తెలిపారు. సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని, ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన స్థితి ఏర్పడిందని ఆయన వాపోయారు. అంతేకాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రీయింబర్స్మెంట్ సకాలంలో అందేదని గుర్తు చేశారు. అయితే 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో పరిస్థితులు మారిపోయాయని ఆ సమయంలో ఆరోపించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




