"Will Wipe Iran Off the Face of Earth": ట్రంప్ సంచలన హెచ్చరిక.. అగ్రరాజ్యం యుద్ధ నౌకలు సిద్ధం!

ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ మాస్ వార్నింగ్. తనను టార్గెట్ చేస్తే ఇరాన్ దేశాన్ని తుడిచిపెట్టేయాలని సైన్యానికి ఆదేశం. మిడిల్ ఈస్ట్ వైపు దూసుకుపోతున్న అమెరికా యుద్ధ నౌకలు.

santhoshi
Published on: 21 Jan 2026 1:38 PM IST
Will Wipe Iran Off the Face of Earth: ట్రంప్ సంచలన హెచ్చరిక.. అగ్రరాజ్యం యుద్ధ నౌకలు సిద్ధం!
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇరాన్ మధ్య దశాబ్దాల వైరం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. తన ప్రాణాలకు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ట్రంప్ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఇరాన్ తనను టార్గెట్ చేస్తే.. ఆ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా తుడిచిపెట్టాలని తన సైన్యానికి ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

సైన్యానికి ట్రంప్ 'మాస్' వార్నింగ్

ఒక టీవీ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై తనకున్న ఆగ్రహాన్ని బహిరంగంగా వెల్లడించారు.

తుడిచిపెట్టేయండి: "నాకు ఏమైనా జరిగితే.. ఎదురుచూడకుండా ఇరాన్‌ను ఈ భూమి మీద నుంచి శాశ్వతంగా తుడిచిపెట్టేయాలని నా సైనిక సలహాదారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను" అని ట్రంప్ పేర్కొన్నారు.

నాయకత్వంపై విమర్శ: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఒక 'రోగి'గా అభివర్ణించిన ట్రంప్, ఆ దేశానికి కొత్త నాయకత్వం అవసరమని వ్యాఖ్యానించారు.

ఇరాన్ ప్రతిస్పందన: 'మీ ప్రపంచాన్ని తగలబెడతాం'

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి జనరల్ అబుల్ ఫజల్ షేకర్చి తీవ్రంగా స్పందించారు. "మా నాయకుడిని తాకాలని చూస్తే ఆ చేతిని నరకడమే కాదు, మీ ప్రపంచాన్నే తగలబెడతాం" అంటూ ప్రతి సవాలు విసిరారు. ఇరు దేశాల మధ్య ఈ మాటల యుద్ధం కాస్తా యుద్ధ మేఘాలుగా మారుతోంది.

మళ్లిన యుద్ధ నౌకలు.. పర్షియన్ గల్ఫ్‌లో టెన్షన్

తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా తన భారీ యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను ఇరాన్ దిశగా మళ్లించింది.

ఈ విమాన వాహక నౌకతో పాటు మూడు డిస్ట్రాయర్లు హిందూ మహాసముద్రం మీదుగా మిడిల్ ఈస్ట్ వైపు దూసుకుపోతున్నాయి.

పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి ఇవి చేరుకుంటే యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్‌లో అంతర్గత కల్లోలం

మరోవైపు ఇరాన్ లోపల కూడా పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఆర్థిక సంక్షేమంపై జరుగుతున్న నిరసనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. మానవ హక్కుల సంస్థల లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 4,519 మంది పౌరులు మరణించగా, సుమారు 26,300 మందిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ఈ మరణాలకు అమెరికానే కారణమని ఇరాన్ ఆరోపిస్తుంటే, నిరసనకారులను చంపడంపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు.

santhoshi

santhoshi

Next Story