Who is Nimisha Priya: ఎవరీ నిమిష ప్రియ? యెమెన్‌లో ఆమెకు మరణ శిక్ష ఎందుకు విధించారు?

Pavan Reddy
Updated on: 1 Jan 2025 4:30 PM IST
Who is Nimisha Priya: ఎవరీ నిమిష ప్రియ? యెమెన్‌లో ఆమెకు మరణ శిక్ష ఎందుకు విధించారు?
X

Who is Nimisha Priya and why she was sentenced to death in Yemen: నిమిష ప్రియ అనే భారతీయ మహిళకు యెమెన్ ప్రభుత్వం మరణ శిక్ష విధించింది. తలాల్ అబ్దో మహ్ది అనే వ్యక్తి హత్య కేసులో కేరళకు చెందిన ఈ నర్స్‌కు యెమెన్ సర్కారు మరణ శిక్ష ఖరారు చేసింది. ఇంతకీ ఈ నిమిష ప్రియ ఎవరు? తలాల్ అబ్దో మహ్ది హత్య కేసుతో ఆమెకు ఏం సంబంధం? యెమెన్ చట్టాల ప్రకారం నెల రోజుల్లో నిమిష ప్రియకు మరణ శిక్ష అమలు కావాల్సి ఉంది. మరి ఈ వివాదంపై ఇండియన్ గవర్నమెంట్ ఏం చెబుతోంది?

Nimisha Priya Real story - నిమిష ప్రియ శాడ్ స్టోరీ

నిమిష ప్రియ తొలిసారిగా 2011 లో యెమెన్ వెళ్లారు. అక్కడ ఆమె నర్స్‌గా పనిచేస్తున్నారు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2014 లో ఆమె భర్త, కూతురు ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తరువాత అనుకోకుండా యెమెన్‌లో సివిల్ వార్ కారణంగా మళ్లీ వారు కలుసుకునే అవకాశం రాలేదు. దాంతో ప్రియ అక్కడే ఒక క్లినిక్ ఓపెన్ చేశారు. అందుకోసం యెమెన్‌కు చెందిన తలాల్ అబ్దో మహ్దితో క్లినిక్‌లో భాగస్వామిగా తీసుకున్నారు.

యెమెన్ దేశ చట్టాల ప్రకారం అక్కడ విదేశీయులు వచ్చి మెడికల్ ఫెసిలిటీ రన్ చేయాలంటే అందులో స్థానికుల భాగస్వామ్యం ఉండి తీరాల్సిందే. అందుకే నిమిష ప్రియ స్థానిక చట్టాలను గౌరవిస్తూ అతడితో కలిసి అక్కడ క్లినిక్ రన్ చేస్తూ వచ్చారు.

నిమిష ప్రియ చెప్పిన వివరాల ప్రకారం.. తాను కుటుంబానికి దూరంగా, ఒంటరిగా ఉంటుండటం, తనకు బిజినెస్ పార్ట్‌నర్‌గా తలాల్ అబ్దో మహ్ది అవసరం తప్పనిసరి అవడంతో ఆ పరిస్థితిని ఆసరాగా తీసుకున్నారు. అప్పటి నుండి తలాల్ మహ్ది వల్ల ఆమె జీవితం ఇబ్బందుల్లో పడింది. ఆమె డాక్యుమెంట్స్ తీసుకుని తాను ఆమెను పెళ్లి చేసుకున్నట్లుగా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని, తనను భౌతికంగా, మానసికంగా వేధించారని నిమిష ప్రియ వాపోయారు.

తలాల్ మహ్ది తనపై బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. నిమిష ప్రియ పాస్ పోర్ట్ లాక్కోవడంతో పాటు క్లినిక్ నుండి డబ్బులు డిమాండ్ చేశారు. ఆమెను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు డ్రగ్స్ కూడా ప్రయోగించారు. తలాల్ మహ్ది ఆగడాలు భరించలేకపోయిన నిమిష ప్రియ చివరకు లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలాల్ మహ్దిపై చర్యలు తీసుకోవాల్సిన అక్కడి పోలీసులు అలా చేయకుండా ఆమెనే అరెస్ట్ చేశారు.

Talal Abdo Mahdi Murder case - తలాల్ అబ్దో మహ్దిని ఎవరు మర్డర్ చేశారు?

తలాల్ మహ్ది నుండి పాస్ పోర్ట్ తిరిగి తీసుకుని వేధింపుల నుండి బయటపడేందుకు ప్లాన్ చేస్తోన్న ఆమెకు జైలు వార్డెన్ ఓ ఉపాయం చెప్పారు. తలాల్ మహ్దికి మత్తు మందు ఇచ్చి ఆ తరువాత పాస్ పోర్ట్ తీసుకుని బయటపడాల్సిందిగా సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారమే నిమిష ప్రియ 2017 జులైలో తలాల్ మహ్దికి మత్తు మందు ఇచ్చారు. అయితే, అది కాస్తా ఓవర్ డోస్ అవడంతో ఆయన మృతి చెందారు. ఈ ఊహించని పరిణామంతో ఏం చేయాలో అర్థం కాక తనతో పాటు కలిసి పనిచేసే యెమెన్‌కే చెందిన హనన్ అనే వ్యక్తి సహాయంతో తలాల్ మహ్ది డెడ్ బాడీని నీళ్ల ట్యాంకులో పడేశారు. తలాల్ అబ్దో మహ్ది హత్య కేసులో స్థానిక పోలీసులు నిమిష ప్రియను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 2018 లో యెమెన్ ట్రయల్ కోర్టు ఆమెకు మరణ శిక్ష విధించింది.

ఆ తరువాత తలాల్ అబ్దో మహ్ది మర్డర్ కేసు యెమెన్ సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. 2018 లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును 2023లో సుప్రీం కోర్టు సమర్ధించింది. తాజాగా యెమెన్ ప్రెసిడెంట్ రషద్ అల్-అలిమి కూడా నిమిష ప్రియకు మరణ శిక్షను ఆమోదించే ఫైలుపై సంతకం చేశారు.


తన బిడ్డ నిమిష ప్రియను ఈ చిక్కుల్లోంచి కాపాడుకునేందుకు ఆమె తల్లి, భర్త, కూతురు యెమెన్‌కు వెళ్లినప్పటి ఫోటో

హత్య చేసే ఉద్దేశం లేకుండానే...

తలాల్ అబ్దో మహ్దిని హత్య చేసే ఉద్దేశం నిమిష ప్రియకు లేదు. కానీ మత్తు మందు ఓవర్ డోస్ అయిన కారణంగా తలాల్ అబ్దో మహ్ది చనిపోయారు. ఆ హత్య నేరం నిమిష ప్రియపై పడింది. తలాల్ అబ్దోకు మత్తు మందు ఇచ్చి, ఆయన నుండి పాస్ పోర్టు తీసుకుని, ఆ కష్టాల నుండి బయటపడదాం అనుకున్న నిమిష ప్రియ ఈ ఊహించని ఘటనతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు.

నెలరోజుల్లోపే మరణ శిక్ష అమలు - భారత్ ఏమంటోందంటే..

యెమెన్ చట్టాల ప్రకారం మరో నెల రోజుల్లోపే నిమిష ప్రియకు మరణ శిక్ష అమలు కానుంది. దీంతో నిమిష ప్రియను ఈ కష్టంలోంచి గట్టెక్కించాల్సిందిగా కోరుతూ ఇండియాలో ఉన్న ఆమె కుటుంబం భారత విదేశాంగ శాఖను ఆశ్రయించింది. ఈ విషయంలో తమ వంతు సహాయం చేస్తామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. దీంతో యెమెన్‌లో నిమిష ప్రియకు ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ రెండు దేశాల వాసుల్లో నెలకొంది.

Pavan Reddy

Pavan Reddy

Next Story