అమెరికా-చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం మొదలైందా.. బైడెన్ సర్కార్కు డ్రాగన్ కంట్రీ ఇవ్వబోతున్న ఆ షాక్ ఏంటి?


అమెరికా-చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం మొదలైందా.. బైడెన్ సర్కార్కు డ్రాగన్ కంట్రీ ఇవ్వబోతున్న ఆ షాక్ ఏంటి?
Trade War: యుద్ధం అంటే సైనికులు, బుల్లెట్లు, మిస్సైళ్లు మాత్రమే కాదు. ఆ మాటకొస్తే ఒక్క బొట్టు రక్తం చిందించకుండానే, ఒక్క బుల్లెట్ పేలకుండానే ఎనిమీ అంతు చూడొచ్చు.
Trade War: యుద్ధం అంటే సైనికులు, బుల్లెట్లు, మిస్సైళ్లు మాత్రమే కాదు. ఆ మాటకొస్తే ఒక్క బొట్టు రక్తం చిందించకుండానే, ఒక్క బుల్లెట్ పేలకుండానే ఎనిమీ అంతు చూడొచ్చు. శత్రువు ఆర్థిక వ్యవస్థపై సరయిన నిర్ణయంతో కొట్టే దెబ్బ ఆ దేశాన్ని పాతాళానికి తొక్కేస్తుంది. చాలా కాలంగా అమెరికా-చైనా మధ్య అలాంటి కంటికి కనిపించని యుద్ధమే జరుగుతోంది. ఆ యుద్ధం బైడెన్ సర్కార్ తీసుకున్న డేరింగ్ డెసిషన్తో మరింత ముదిరింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100శాతం పన్ను అస్త్రాన్ని సంధించారు అగ్ర రాజ్యం అధ్యక్షుడు. ఈ నిర్ణయమే ఆ రెండు దేశాల ట్రేడ్ వార్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళుతోంది. ఇంతకూ, అగ్రరాజ్యాల మధ్య అసలేం జరుగుతోంది? వాణిజ్య యుద్ధంలో రియల్ వార్కు మించిన ఆ వ్యూహాలేంటి?
అమెరికా, చైనా ట్రేడ్ వార్లో అగ్రరాజ్యం అధినేత సంచలన ప్రకటన ఇదే. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100 శాతం వరకు పన్ను విధిస్తున్నట్లు బైడెన్ ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, స్టీల్, సోలార్ సెల్స్, అల్యూమినియంపై భారీ సుంకాలు విధించారు. దీంతో పాటు చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం, సెమీకండక్టర్లపై 50 శాతం, బ్యాటరీలపై 25 శాతం, స్టీల్, అల్యూమినియంపై 25 శాతం, సోలార్ ప్యానెల్స్పై 50 శాతం పన్ను విధించింది. వీటన్నింటిపై చైనా భారీ రాయితీలు ఇచ్చిందని, దీని కారణంగా చైనా కంపెనీలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించాయని బైడెన్ ఆరోపించారు.
మరోవైపు.. వంద శాతం పన్ను ప్రకటన తర్వాత జిన్పింగ్ సర్కార్పై సంచలన ఆరోపణలు సైతం చేశారు బైడెన్. చైనా అన్యాయంగా తక్కువ ధరలకు అదనపు ఉత్పత్తులను మార్కెట్లో డంప్ చేసిందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర తయారీదారులను వ్యాపారం నుండి దూరం చేసిందని ఆరోపించారు. ధరలు అసమంజసంగా తక్కువగా ఉన్నాయనీ.. అందుకు చైనా కంపెనీలకు జిన్పింగ్ ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇవ్వడమే కారణమని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై తాను ప్రకటించిన కొత్త టారిఫ్లు అన్యాయమైన వాణిజ్య పద్ధతుల వల్ల అమెరికన్ కార్మికులు వెనక్కి తగ్గకుండా ఉండేలా చూస్తాయనేది బైడెన్ మాట. అమెరికన్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి బ్యాటరీలలో బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెడుతున్నాయి. చైనా విధానంపై బైడెన్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను కూడా విమర్శించారు.
నిజానికి.. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొత్త కాదు. అమెరికా అధిక పన్నుల పేరిట బీజింగ్ను.. రెచ్చగొట్టడం దానికి కౌంటర్గా జిన్పింగ్ సర్కార్ సైతం అలాంటి నిర్ణయాలే తీసుకోవడం ఏళ్లుగా జరుగుతున్నదే. అలాంటి వాణిజ్య యుద్ధాల్లో సెమీ కండక్టర్ చిప్ వార్ ప్రధానమైంది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఈ సెమీకండక్టర్ చిప్పులే. అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్ఫోన్ల నుంచి రక్షణ రంగంలో ఉపయోగించి అత్యాధునిక పరికరాల వరకు దేనికైనా ఇవే ప్రాణం. అయితే వీటిని అన్ని దేశాలు ఉత్పత్తి చేయలేవు.
చిప్స్ తయారీ రంగంలో అన్ని దేశాలు లేవు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి కావాల్సిన ఖనిజాలు అందుబాటులోనే ఉంటేనే.. చిప్స్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు దేశాలు మాత్రమే సెమీ కండక్టర్ల తయారీలో ఉన్నాయి. తైవాన్, దక్షిణకొరియా, జపాన్, అమెరికా, చైనా ఈ 5 దేశాలు మాత్రమే సెమీకండెక్టర్ మానిఫాక్చరింగ్లో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. అయితే వీటిలో కూడా ఇప్పటికీ మొదటి స్థానం తైవాన్దే. మిగతా దేశాలు చిప్ తయారీకి కావల్సిన సాంకేతిక పరిజ్ఞానం, ఖనిజాల కోసం అవి లభించే దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇదే అమెరికా చైనా మధ్య చిప్ వార్కు దారితీసింది.
మరోవైపు.. సూపర్ పవర్గా నిలిచే క్రమంలో ఎప్పటి నుంచో వాణిజ్య యుద్ధాన్ని కొనసాగిస్తున్న అమెరికా, చైనా సెమీ కండెక్టర్ల తయారీ విషయంలోనూ ఎవరి ప్రయోజనాలను వాళ్లు కాపాడుకునేందుకు వ్యూహప్రతివ్యూహాలు అమలు చేయడం మొదలు పెట్టాయి. చిప్ మానుఫ్యాక్చరింగ్ హబ్గా మారేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు అమెరికా 2022 అక్టోబర్లో కీలక మైన టెక్నాలజీ టూల్స్ ను చైనాకు ఎగుమతి చేయడం నిలిపివేసింది. చిప్స్, సెమీ కండక్టర్ల తయారీకి అవసరమైన సాంకేతికతకు చైనాకు చేరకుండా అడ్డుకుంది. ఈ పరిణామం డ్రాగన్ కంట్రీ ఆగ్రహానికి కారణమైంది. దీంతో అగ్రరాజ్యాన్ని అదును చూసి దెబ్బకొట్టేందుకు కొంతకాలం పాటు ఎదురుచూసిన చైనా.. గతేడాది అమెరికాకు షాక్ ఇచ్చేలా ఓ నిర్ణయం తీసుకుంది. సెమీ కండక్టర్ల తయారీలో కీలక పాత్ర పోషించే రెండు మూలకాలను విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఈ పరిణామం అగ్రరాజ్యం అమెరికాకు దిమ్మతిరిగే కౌంటర్గా చైనా భావించింది.
జాతీయ భద్రత పరిరక్షణలో భాగంగా 2023 జులై 3 నుంచి గాలియం, జర్మేనియం అనే రెండు మెటల్స్ ఎగుమతిపై ఆంక్షలు విధిస్తున్నట్టు డ్రాగన్ కంట్రీ ప్రకటించింది. ఈ రెండు మూలకాలను ఇకపై చైనా సరిహద్దులు దాటించాలంటే ఎగుమతిదారులకు కచ్చితంగా లైసెన్స్ ఉండాలి. ఏ దేశంలో ఎవరికి అమ్ముతున్నారనే విషయాలను కూడా ముందే చెప్పాలి. ఇక్కడే చైనా తెలివిగా వ్యవహరించింది. ఈ రెండు మూలకాలను అమెరికా చిప్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు చేరకుండా చేసేందుకు ఈ రూల్ తీసుకొచ్చింది. ఇవి అందుబాటులో లేకపోతే సెమీ కండక్టర్ల ఇండస్ట్రీ చాప చుట్టేయాల్సిందే.
వాస్తవానికి.. సెమీకండక్టర్ చిప్స్ తయారీలో గాలియం, జర్మేనియందే కీలక పాత్ర. చిప్ల తయారీకి కావాల్సిన టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. ఈ రెండు మెటల్స్ లేకపోతే సెమీ కండక్టర్ల ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని చూస్తాయి. అందుకే ఈ చిప్స్ ఏ దేశంలో తయారైనా ఈ రెండు మూలకాల కోసం ఆయా దేశాలు చైనా మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 80శాతం గాలియం చైనాలోనే ఉత్పత్తి అవుతుంది. అలాగే 60 శాతం జర్మేనియం కూడా డ్రాగన్ నుంచే వస్తుంది. ఈ రెండింటినీ ఉత్పత్తి చేసే శక్తి సామర్థ్యాలు అమెరికా సహా అనేక దేశాలకు లేకపోవడంతో చైనా గేమ్ ప్లాన్ను అమలు చేస్తోంది.
ఇది జరిగిన ఇంత కాలం తర్వాత చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 100శాతం పన్ను ప్రకటన చేయడం, వాటిలో సెమీకండక్టర్లపై 50 శాతం పన్ను విధిస్తున్నట్టు ప్రకటించడం ఉత్కంఠ రేపుతోంది. చూస్తుంటే అగ్రరాజ్యాల మధ్య అసలైన ట్రేడ్ వార్ ఇప్పుడే మొదలైనట్టు కనిపిస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



