
ఆఫ్ఘన్ గడ్డపై మారణహోమం..పాకిస్థాన్ దెబ్బకు కుప్పకూలిన భవనాలు..గాల్లో వందలాది మంది ప్రాణాలు
Pakistan Air Strikes : పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుకున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ సైన్యం ఆఫ్ఘనిస్థాన్లోని పలు నగరాలపై భీకరమైన వైమానిక దాడులకు తెగబడింది. ముఖ్యంగా బెహ్సూద్ జిల్లాలో ఒక సామాన్య పౌరుడి ఇంటిని లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘోర దాడి సమయంలో ఇంట్లోని వారంతా గాఢ నిద్రలో ఉండటంతో, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఇల్లు కుప్పకూలిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన 23 మంది శిథిలాల కింద చిక్కుకుపోయిన ఈ ఘటన స్థానికంగా పెను కలకలం రేపింది.
శిథిలాల కింద 23 మంది.. కొనసాగుతున్న ఆర్తనాదాలు
స్థానిక పోలీసు అధికారి సయీద్ తయ్యబ్ హమ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. పాక్ జరిపిన ఈ వైమానిక దాడుల్లో బెహ్సూద్లోని ఒక నివాస భవనం పూర్తిగా నేలమట్టమైంది. అందులో ఒక మదర్సా కూడా నడుస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సహాయక బృందాలు ఇప్పటివరకు కేవలం నలుగురిని మాత్రమే ప్రాణాలతో బయటకు తీయగలిగారు. మిగిలిన 19 మంది పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. శిథిలాల కింద నుంచి వినిపిస్తున్న ఆర్తనాదాలు స్థానికులను కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే పలువురు మరణించినట్లు సమాచారం అందుతోంది, అయితే అధికారిక లెక్కలు ఇంకా వెలువడాల్సి ఉంది.
ఏడు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు.. పాక్ వెర్షన్ ఏంటంటే?
పాకిస్థాన్ సమాచార శాఖ ఈ దాడులపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. సరిహద్దు ప్రాంతమైన బర్మల్ జిల్లాలో టిటిపి, ఐఎస్కెపి ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా తాము డ్రోన్ దాడులు చేశామని పాక్ వాదిస్తోంది. మొత్తం ఏడు స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేశామని, తాము నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదని బుకాయిస్తోంది. ఉగ్రవాదుల ఏరివేత చర్యలు కొనసాగుతాయని పాక్ హెచ్చరించింది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్యుల ఇళ్లు ధ్వంసమవ్వడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బర్మల్, ఉర్గూన్, ఖోగ్యాని వంటి ప్రాంతాల్లోనూ పాక్ విమానాలు గర్జించాయి.
తిరగబడతాం.. తాలిబన్ల ఘాటు హెచ్చరిక
పాక్ అనాలోచిత చర్యపై ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడింది. తమ గగనతల సార్వభౌమాధికారాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఈ దాడుల నేపథ్యంలో కాబూల్, కందహార్ నగరాల్లో తాలిబన్ అగ్రనాయకత్వం అత్యవసర సమావేశాలు నిర్వహించింది. ఇప్పటికే సౌదీ అరేబియా, ఖతార్, తుర్కియే వంటి దేశాలకు పాక్ దుశ్చర్యపై సమాచారం అందించింది. సరైన సమయం వచ్చినప్పుడు పాకిస్థాన్కు దీటైన సమాధానం ఇస్తామని, ప్రతిదాడి చేసే హక్కు తమకు ఉందని తాలిబన్లు ప్రకటించడంతో సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




