Old Sagaing Bridge: భూకంపం ధాటికి నదిపై కుప్పకూలిన బ్రిడ్జి.. భారత్‌లోనూ ప్రకంపనలు

Pavan Reddy
Updated on: 7 May 2025 1:10 PM IST
old Sagaing Bridge collapsed on Irrawaddy river after strong earthquake hits Myanmar and Bangkok
X

Old Sagaing Bridge: భూకంపం ధాటికి నదిపై కుప్పకూలిన బ్రిడ్జి.. భారత్‌లోనూ ప్రకంపనలు

Sagaing Bridge collapsed in Myanmar

Sagaing Bridge collapsed in Myanmar: మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు శుక్రవారం భూకంపంతో చిరుగుటాకులు వణికిపోయాయి. మయన్మార్‌లోని మండాలయ్, సగైంగ్ నగరాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. సగైంగ్ రీజియన్ నుండి మండాలయ్ రీజియన్ వెళ్లే రహదారి మధ్యలో ఇర్రవడి నదిపై నిర్మించిన ఓల్డ్ సగైంగ్ బ్రిడ్జి ఈ భూకంపం ధాటికి కుప్పకూలింది.

మయన్మార్‌లో అతి పొడవైన నదిగా ఇరవడి నదికి పేరుంది. నదికి ఇరువైపులా ఉన్న రెండు కీలకమైన ప్రాంతాలను కలిపే వంతెన ఇది. మండాలయ్ ఆ దేశంలోనే రెండో అతిపెద్ద నగరం కావడంతో ఈ నదిపై నిత్యం రాకపోకలు సాగించే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది.

90 ఏళ్ల క్రితం బ్రిటీష్ పాలనలో ఈ నది వంతెనను నిర్మించారు. ఈ పాత కాలం నాటి బ్రిడ్జికి కొద్దిదూరంలోనే మరో కొత్త వంతెనను నిర్మించారు. ప్రస్తుతం ఆ వంతెన పరిస్థితి ఏంటనేది ఇంకా అర్థం కావడం లేదు. పాత బ్రిడ్జి కూలిపోవడంతో కొత్త బ్రిడ్జిపై రాకపోకలు నిలిపేశారు. కొత్త బ్రిడ్జి కూడా దెబ్బ తిని ఉంటుందని అధికారులు, స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

చలించిన ప్రధాని మోదీ

మయన్మార్, థాయ్ ల్యాండ్ లో భూకంపం మిగిల్చిన నష్టంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆ రెండు దేశాలకు తగిన విధంగా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

ఈ విపత్తు నుండి అందరూ క్షేమంగా బయటపడాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు. రెండు దేశాల ప్రభుత్వాలకు అందుబాటులో ఉండాల్సిందిగా భారత విదేశాంగ శాఖను ఆదేశించినట్లు మోదీ తెలిపారు.

ఎమర్జెన్సీ విధింపు, రైలు, విమాన సేవలు రద్దు

మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. ముందు జాగ్రత్తగా రెండు దేశాల్లోనూ విమానాశ్రయాలు మూసేసి తాత్కాలికంగా సేవలు నిలిపేశారు. రైలు, మెట్రో రైలు సేవలు కూడా రద్దు చేశారు.

భారత్‌లోనూ ప్రకంపనలు

భారత్‌లోని మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భౌగోళికంగా మయన్మార్‌కు మేఘాలయ, మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాలు దగ్గరిగా ఉంటాయి. మయన్మార్‌లోని భూకంపం ప్రభావం, పొరుగునే ఉన్న థాయ్‌లాండ్‌తో పాటు చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో మరోసారి భూకంపం వస్తే తమ రాష్ట్రాల్లోనూ అలాంటి ప్రభావం పడుతుందా అనే ఆందోళనకర వాతావరణం ఈశాన్య రాష్ట్రాల్లో కనిపిస్తోంది.

మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ సంఖ్యలో భారతీయులు కూడా ఉన్నందున వారి యోగ సమాచారం కోసం ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్స్ ప్రకటించింది.

థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్: +66-2-260-0000

బ్యాంకాక్‌లో ఇండియా కాన్సూలేట్ జనరల్ హెల్ప్ లైన్: +66-2-662-9000

మయన్మార్‌లోని మండాలయ్‌లో ఉన్న ఇండియన్ కాన్సుల్ జనరల్ ఆఫీస్: +95‐92054490, 0095‐281019

Pavan Reddy

Pavan Reddy

Next Story