Donald Trump: భారత్‌లోకి టెస్లా.. మస్క్ చేసేది అన్యాయం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయం అన్యాయమని తెలిపారు. మస్క్ పక్కన ఉండగానే అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Vijaya Laxmi
Published on: 20 Feb 2025 2:56 PM IST
Musks Tesla Building Factory in India is unfair decision says Trump
X

భారత్‌లోకి టెస్లా.. మస్క్ చేసేది అన్యాయం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump: అమెరికా కంపెనీ టెస్లా.. భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగిసిన తర్వాత టెస్లా ఇండియాలో ప్రవేశించేందుకు లైన్ క్లియర్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టెస్లా ఇక్కడ షోరూంల ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయం అన్యాయమని తెలిపారు. మస్క్ పక్కన ఉండగానే అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ట్రంప్, మస్క్ ఇద్దరూ కలిసి ఫ్యాక్స్ న్యూస్‌‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్‌లోకి టెస్లా ఎంట్రీ పై మాట్లాడిన ట్రంప్.. ప్రపంచంలోని ప్రతి దేశం తమను వాడుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. అమెరికా వస్తువులపై భారీగా దిగుమతి సుంకాలను విధిస్తూ తమ నుంచి లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు. అందుకు భారత్ మంచి ఉదాహారణ అని చెప్పారు. దీంతో మస్క్ తన కార్లను విక్రయించడం అసాధ్యంగా మారుతోంది.

ఇప్పుడు మస్క్ భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది అతకు మంచిదే కావచ్చు.. కానీ అమెరికా పరంగా అది చాలా అన్యాయమైన నిర్ణయమన్నారు ట్రంప్. ఈ సందర్భంగా గతవారం భారత ప్రధాని మోడీతో భేటీని గుర్తు చేసుకున్నారు. ఆ సమావేశంలో విద్యుత్ కార్లపై అధిక సుంకాల విషయాన్ని మోడీతో ప్రస్తావించినట్టు చెప్పారు. సుంకాల సమస్యలను పరిష్కరించడంతో పాటు వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాలు కలిసి పని చేసేలా నిర్ణయించినట్టు తెలిపారు.

ఇటీవల మోడీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేత మస్క్ అతనితో సమావేశమయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ సంస్థ భారత్‌లో నియమాకాలు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే విక్రయ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే మోడీ పర్యటనలతో భారత్‌ మార్కెట్‌లోకి టెస్లా ప్రవేశానికి రంగం సుగమం అయినట్టు తెలుస్తోంది. దీంతో భారత్‌లో టెస్లా తన ఉనికిని చాటుకునేందుకు చర్యలు చేపట్టింది. టెస్లా ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబైలో షోరూంల కోసం స్థలాలను గుర్తించినట్టు ప్రకటించింది.

భారత్‌లో విద్యుత్ కార్ల తయారీ పై టెస్లా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు ఇటీవల భారత ప్రభుత్వం నూతన ఈవీ పాలసీని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కార్ల తయారీ సంస్థలు దేశంలో కనీసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే దిగుమతి సుంకాలను 15 శాతానికి తగ్గించేలా కేంద్రం కొత్త విధానం తీసుకొస్తోంది. ఈ పరిణామాల వేళ ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్య సంతరించుకున్నాయి.

Vijaya Laxmi

Vijaya Laxmi

Next Story