అమెరికాలో ఇండియన్ స్టూడెంట్‌కు యాక్సిడెంట్.. వీసా కోసం తండ్రి తిప్పలు

Pavan Reddy
Updated on: 27 Feb 2025 3:42 PM IST
Indian student Neelam Shinde from Maharashtra met with accident in US gone into coma and her family in struggle for US Visa
X

అమెరికాలో ఇండియన్ స్టూడెంట్‌కు యాక్సిడెంట్.. వీసా కోసం తండ్రి తిప్పలు

Indian student injured in US road accident: అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుకునేందుకు వెళ్లిన నీలం షిండే అనే మహారాష్ట్ర విద్యార్థికి ఫిబ్రవరి 14న రోడ్ యాక్సిండెంట్ అయింది. క్యాలిఫోర్నియాలో ఉంటున్న ఆమెను ఒక వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో నీలం తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుండి ఆమె కోమాలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. నాలుగేళ్ల క్రితం నీలం అమెరికా వెళ్లారు.

మహారాష్ట్రలోని సతరాలో ఉంటున్న ఆమె కుటుంబసభ్యులకు ఫిబ్రవరి 16న ఈ ప్రమాదం గురించి సమాచారం అందింది. నీలం రూమ్‌మేట్స్ ద్వారానే వారికి ఈ విషయం తెలిసింది. అప్పటి నుండి ఆమె తండ్రి తనాజి షిండే అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

కూతురు నీలం షిండే మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నందున ఆమెను చూసుకునేందుకు తనాజి షిండే అర్జెంట్ వీసాకు అప్లై చేశారు. కానీ అమెరికా వీసా రావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలని కోరుతూ తనాజి షిండే కేంద్రాన్ని కోరారు.

నీలం షిండే కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం.. "ఈ రోడ్డు ప్రమాదంలో ఆమె చేతులు, కాళ్లు, ఛాతి, తల భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. బ్రెయిన్ సర్జరీ చేయడం కోసం అక్కడి డాక్టర్స్ కుటుంబసభ్యుల అనుమతి తప్పనిసరిగా కావాలని అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను తాము పక్కనే ఉండి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తంచేస్తోంది. ఎన్నివిధాలుగా ప్రయత్నించినప్పటికీ వీసా అపాయిట్మెంట్ స్లాట్స్ దొరకడం లేదని తనాజీ షిండే తల్లడిల్లిపోతున్నారు.

నీలం షిండే పరిస్థితి గురించి తెలుసుకున్న ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలె ఆ కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ఆ కుటుంబానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ ఆమె ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, విదేశాంగ శాఖను, అమెరికాలో ఉన్న ఇండియన్ ఎంబసీని ట్యాగ్ చేశారు.

ఇదే విషయమై సుప్రియ సూలె స్పందిస్తూ... విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ బీజేపి నేత కావడం వల్ల వారితో తమకు రాజకీయ విబేధాలు ఉండొచ్చునేమో కానీ అది దృష్టిలో పెట్టుకుని ఆయన సహాయం చేయకుండా ఉండరని అన్నారు. విదేశాల్లో ఉన్న ఇండియన్ స్డూడెంట్స్‌కు అవసరమైన సహాయం చేసే విషయంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారని సుప్రియ అభిప్రాయపడ్డారు.

Also watch this video - Gold Cards scheme in US: విదేశీ ధనవంతులకు గోల్డ్ కార్డ్స్ అమ్ముతాం అంటున్న డోనల్డ్ ట్రంప్

Pavan Reddy

Pavan Reddy

Next Story