ఎచ్చెర్లలో ఎగిరే జెండా ఏది.. గెలుపుపై ఎవరిది ధీమా ఏంటి?

Santosh
Published on: 29 April 2019 5:20 PM IST
ఎచ్చెర్లలో ఎగిరే జెండా ఏది.. గెలుపుపై ఎవరిది ధీమా ఏంటి?
X

రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రి కళా వెంకట్రావుకు సొంత నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఎదురుకానున్నాయి.? అధికార పార్టీ వైఫల్యాలను అందిపుచ్చుకోవడంలో అక్కడ ప్రతిపక్షం రాణించిందా? శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిన ఎచ్చెర్ల నియోజకవర్గంలో పోటా పోటీగా జరిగిన సార్వత్రిక ఎన్నికల పోరులో గెలుపెవరిది? విజయంపై ఎవరికీ వారు ధీమాగా ఉన్న అసలు సంగతి ఏంటి? ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? ఎచ్చర్లలో ఎగిరే జెండా ఏది?

శ్రీకాకుళం జిల్లాలో అందరి దృష్టి ఎచ్చెర్ల నియోజకవర్గంపై పడింది.. టీడీపీ నుంచి కళా వెంకట్రావు, వైసీపీ నుంచి గొర్లె కిరణ్‌కుమార్ ఎన్నికల బరిలో నిలిచారు. ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, జి.శిగడాం మండలాల్లో తూర్పుకాపు సామాజికవర్గానిదే పట్టు. రెడ్డిక, కాళింగ, మత్సకారులు తరువాతి స్థానాల్లో ఉన్నారు. 2,31,279 ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో మొననటి ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధికంగా 84.30 శాతం పోలింగ్ అయింది.

ఇక అభ్యర్ధుల విషయానికి వస్తే ఎన్టీఆర్ అభిమానిగా తెలుగుదేశం పార్టీలో చేరిన కళా వెంకట్రావు 1983, 1985, 1989, 2004 ఎన్నికల్లో ఉణుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్ వద్ద విధేయుడిగా ఉన్న కళా ఆయన మంత్రి వర్గంలో రాష్ట్ర హోం, వాణిజ్య పన్నుల శాఖ, పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో ఓడిపోయిన కళా వెంకట్రావును రాజ్యసభ సభ్యునిగా చంద్రబాబు నియమించారు. 2009 ఎన్నికలకు ముందు వరకు ఉణుకూరు నియోజకకర్గానికి ప్రాతినిధ్యం వహించిన కళా నియోజకవర్గాల పునర్విభజనతో ఎచ్చెర్లకు మారిపోయారు. 2009 ఎన్నికల్లో పీఆర్‌పీ తరుపున ఎచ్చెర్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత సొంతగూటికి చేరుకున్న కళావెంకట్రావు 2014 ఎన్నికల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రివర్గ విస్తరణలో విద్యుత్ శాఖమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇక మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న కళా వెంకట్రావుకు అనేక అంశాలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నా తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతో వాటిని సమర్ధవంతంగా ఎదుర్కున్నాననే విశ్వాసంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. జి.సిగడాం, రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు మండలాల్లో ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లోని కీలక నేతలను ఎన్నికలకు ముందే సైకిల్ ఎక్కించారు. నియోజకవర్గంలో పార్టీ అనూహ్యంగా బలపడిందని అది తన గెలుపు దోహదపడతాయని ఆయన నమ్మకంతో ఉన్నారు. తోటపల్లి ఆధునీకరణ, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్వాసితులకు సకాలంలో పరిహారం అందించటంతో పాటు ఎన్నికల హామీలో లేని ట్రిపుల్ ఐటి విద్యా సంస్థ నియోజకవర్గానికి రావడం వంటి అంశాలు ఎన్నికల్లో తనకు ప్లస్‌గా మారాయని భావిస్తున్నారు. వీటికి తోడూ పెన్షన్లు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ ఎన్నికల్లో ప్రభావం చూపాయంటారు.

ఎచ్చెర్లలో పాగా వేసేందుకు వైసీపీ కూడా అదే స్థాయిలో ప్రయత్నించింది. మొదటి నుంచి టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మంత్రులు ప్రాత్నిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో సత్తా చాటాలని నిర్ణయించుకుంది. ఎచ్చెర్లలో కళా వెంకట్రావుకి దీటుగా గొర్లె కిరణ్‌ను వైసీపీ బరిలోకి దింపింది. టీడీపీ మీద, కళా మీద ఉన్న వ్యతిరేకత తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నించింది. బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న కిరణ్‌కు నియోజకవర్గంలో బలమైన పార్టీ క్యాడర్ కూడా లాభించిందన్నది వైసీపీ ఫుల్ లెంత్ కాన్ఫిడెన్స్.

Santosh

Santosh

Next Story