ఎన్నికల యుద్ధంలో విరాట్‌ యుద్ధనౌక

ఎన్నికల యుద్ధంలో విరాట్‌ యుద్ధనౌక
x
Highlights

ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌక ఎన్నికల అస్త్రంగా మారిపోయింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని పదునైన విమర్శలతో ఏకిపారేస్తున్న ప్రధాని మోడీ ఈసారి హద్దు మీరారా?...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌక ఎన్నికల అస్త్రంగా మారిపోయింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని పదునైన విమర్శలతో ఏకిపారేస్తున్న ప్రధాని మోడీ ఈసారి హద్దు మీరారా? ఐఎన్ ఎస్ యుద్ధ నౌకను వివాదంలోకి లాగి పరువు తీశారా? మోడీ విమర్శలపై కాంగ్రెస్ మరోసారి ఈసీ తలుపు తట్టింది.

ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు పెరిగిపోతున్నాయి. గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పై విరుచుకు పడుతున్న ప్రధాని మోడీ ఆరోదశ ఎన్నికల నాటికి రాజీవ్ గాంధీ లక్ష్యంగా చేసిన విమర్శలు ఒక్కసారిగా హీట్ పెంచేశాయి. రాజీవ్ చరిత్ర హీనుడని,నెంబర్ వన్ అవినీతిపరుడనీ ఆరోపించిన ప్రధాని కాంగ్రెస్ పార్టీపై మరింత తీవ్రంగా చెలరేగిపోతున్నారు. బోఫోర్స్ స్కాం, భోపాల్ విషవాయువుల ఉదంతాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసేశారు మోడీ. దీనికి కౌంటర్ గా రాజీవ్ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, రాజీవ్ ను ఆడిపోసుకుని అమరవీరుల మనసు గాయపడేలా చేస్తున్నారనీ రాహుల్, ప్రియాంక ఎదురు దాడి చేశారు.

కాంగ్రెస్ పై బీజేపీ దాడి ఇక్కడితో ఆగలేదు. ఢిల్లీ నడిబొడ్డున రాం లీలా మైదానంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోడీ రాజీవ్ జాతి భద్రతకుద్దేశించిన ఐఎన్ ఎస్ విరాట్ నౌకను తన సొంత విహారాలకు వాడుకున్నారంటూ ఆరోపించారు. ప్రధాని పదవిలో ఉండగా తన అత్తింటి వారితో వేసవి శెలవుల విహారానికి ఐఎన్ ఎస్ విరాట్ నౌకను వినియోగించుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

నావికా దళం యుద్ధ అవసరాలకు వినియోగించాల్సిన నౌకను తన బంధు వర్గానికి వేసవి విడిదిగా మార్చేశారని దుయ్యబట్టారు. అయితే మోడీ చేసిన ఈ ఆరోపణపై నావికా దళమే తీవ్రంగా స్పందించింది.రాజీవ్ అప్పట్లో ప్రధానిగా ఉన్నారని ఈ నౌకను విహార యాత్ర వాహనంగా వాడారనడం సరికాదని నావికాదళం మాజీ చీఫ్ రాందాస్ కామెంట్ చేశారు. రాజీవ్ ప్రధాని హోదాలో ఉన్నారని ఆయన లక్ష ద్వీప్ లో కొన్ని అత్యవసర సమావేశాల్లో, కొన్ని రివ్యూ మీటింగుల్లో పాల్గొన్నారని, ప్రధాని భద్రత కోసం ఐఎన్ ఎస్ విరాట్ ను అక్కడ తీరంలో నిలిపి ఉంచాం తప్ప నౌక దుర్వినియోగం కాలేదంటున్నారు.రాజీవ్ టైం లో లక్ష ద్వీప్ లో పనిచేసిన తొలితరం నావికా దళాధికారి కూడా మోడీ వ్యాఖ్యలను ఖండించారు.

మోడీ ఐఎన్ ఎస్ విరాట్ వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. కాంగ్రెస్ మోడీ ఆరోపణలపై మండి పడింది. కాంగ్రెస్ ను ఎదుర్కొనే దమ్ములేక మోడీ పిరికి పందలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రాజీవ్ ను ఎన్నికల అస్త్రంగా చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని కానీ రాఫెల్ డీల్ గురించి ప్రధాని జాతికి వివరణ ఇచ్చి తీరాల్సిందేనంటున్నారు రాహుల్ గాంధీ. మరోవైపు ఐఎన్ ఎస్ విరాట్ లో రాజీవ్ అత్తింటి వారయిన సోనియా తల్లి, సోదరుడు, మేనమామ తదితరులతో పాటూ రాజీవ్ ప్రియ స్నేహితుడు అమితాబ్, జయాబచ్చన్, అభిషేక్, శ్వేతా బచ్చన్ కూడా ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మన యుద్ధ నౌకలపై విదేశీయులు అతిధులుగా ఎలా సేదతీరుతారని, ఇది దేశ భద్రతా నియమాళిని ఉల్లంఘించడమేనని బీజేపి అంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories