
దేశంలో వివిధ పార్టీల మధ్య పొత్తులు బీజేపీకి ముప్పుగా మారనున్నయా....బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాటలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. బీఎస్పీ నాయకురాలు...
దేశంలో వివిధ పార్టీల మధ్య పొత్తులు బీజేపీకి ముప్పుగా మారనున్నయా....బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాటలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. బీఎస్పీ నాయకురాలు మాయావతి ప్రభావాన్ని అంచనా వేయలేక గతంలో ఫూల్పూర్, గోరఖ్పూర్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయామని, ఇప్పుడు ఆ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని బీజేపీ చెబుతోంది. అమిత్ షా ప్రధానంగా యూపీని ప్రస్తావించినప్పటికీ, మిగితా పలు రాష్ట్రాల్లో సైతం ప్రాంతీయ పార్టీలు బీజేపీకి సవాలు విసిరే అవకాశం ఉంది. అదే సమయంలో ఆయా పార్టీలు తమ అవసరాల రీత్యా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది. కర్నాటక తరువాత తాజాగా బీజేపీ మరో పరీక్షను ఎదుర్కోనుంది. యూపీలో విపక్షాలు ఏకవుతున్న నేపథ్యంలో అక్కడి ఉప ఎన్నిక బీజేపీకి కీలకంగా మారింది. అంతేకాదు, యూపీలో ఇటీవల ఉప ఎన్నికల్లో రెండు స్థానాలు కోల్పోయింది. దాంతో ఈ ఎన్నికల ఫలితం బీజేపీకి మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. మరో వైపున విపక్షాలకు కూడా ఇది బీజేపీని ఎదుర్కొనేందుకు సరికొత్త మార్గాన్ని చూపిస్తోంది.
రాష్ట్రాల వారీగా పార్టీల మధ్య పొత్తుకు బాట వేస్తోంది. యూపీలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ హుకుం సింగ్ మరణంతో కైరానాలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన కుమార్తె మృగాంక సింగ్కు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. విపక్షాలు కలిసి ఉమ్మడి ఆర్ఎల్డీకి చెందిన తబస్సుం హసన్ను పోటీకి దింపాయి. మరో వైపున లోక్దళ్ అభ్యర్థి కన్వర్ హసన్ పోటీ నుంచి తప్పుకొని ఆర్ఎల్డీలో చేరారు. 2017 ఎన్నికల్లో నషీద్ ఎస్పీ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం నషీద్ తల్లి తబస్సుం ఆర్ఎల్డీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో దళితుల మద్దతు పొందడానికి బీజేపీ హిందుత్వ కార్డును ఉపయోగిస్తోంది. మరో వైపున ముస్లీంలను మూకుమ్మడిగా తమవైపు తిప్పుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.ఈ నియోజకవర్గంలో 5.26 లక్షల ముస్లిం ఓటర్లు ఉన్నారు. వారంతా తమకు మద్దతు ఇస్తారని విపక్షాలు అంచనా వేస్తున్నాయి.
కేసీఆర్ విషయానికి వస్తే... ఆయన బీజేపీయేతర, కాంగ్రేసేతర కూటమిని ప్రతిపాదించారు. అదే విషయమై జేడీఎస్ నాయకులతో భేటీ కూడా అయ్యారు. వారి నుంచి సానుకూల స్పందన లభించినట్లుగా వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో జేడీఎస్ కాంగ్రెస్ తో జట్టు కట్టడం కేసీఆర్ కు రుచించలేదు. అందుకే ఆయన ఒక రోజు ముందుగానే బెంగళూరుకు వెళ్ళి కుమారస్వామిని వచ్చి అభినందించి వచ్చారు. కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించిన విపక్ష నాయకుల షో లో ఆయన పాల్గొనలేదు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి అంతగా బలం లేదు. ప్రధాన విపక్షంగా ఉన్నది కాంగ్రెస్ మాత్రమే. అదే సమయంలో కేసీఆర్ ఈ రెండు పార్టీలకూ దూరంగా ఉండాలన్న యోచనలో ఉన్నారు. ఆయనతో ఎంతమంది ఇతర రాష్ట్రాల నాయకులు చేతులు కలుపుతారన్నది అనుమానమే. గతంలో ఆయన కోల్ కతా వెళ్ళి మమతా బెనర్జీని కూడా కలిసివచ్చారు. తాజాగా బెంగళూరు ఎపిసోడ్ లో మమతా బెనర్జీ కూడా కీలకపాత్ర పోషించారు. ఇలా ఒక్కొక్కరే కేసీఆర్ జాబితా లో నుంచి జారిపోతున్నారు. చివరకు బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి విషయంలో ఆయనతో ఎంత మంది కలసి నడుస్తారో వేచి చూడాల్సిందే. ఇందుకు ప్రధాన కారణంగా వివిధ రాష్ర్టాల్లో నాయకులంతా కూడా సమయ సందర్భాలను బట్టి అటు కాంగ్రెస్ లేదా బీజేపీ...ఏదో ఒక దానితో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడడమే.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire