
నా జీవితంలోనే చేసిన గొప్ప పని.....రైతు క్షేమంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. దేశంలో ఇంతకు ముందెన్నడూ లేని గొప్ప పథకం ఇది.....రైతు మరణించిన పది...
నా జీవితంలోనే చేసిన గొప్ప పని.....రైతు క్షేమంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. దేశంలో ఇంతకు ముందెన్నడూ లేని గొప్ప పథకం ఇది.....రైతు మరణించిన పది రోజుల్లోనే బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల సాయం అందుతుంది....ఇదీ కేసీఆర్ చెప్పిన మాట. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగానే ఇలాంటి స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు. ముందుగా బీమా.... అంటే ...ఇన్సూరెన్స్ అంటే ఏమిటో చూద్దాం. ప్రమాదవశాత్తూ ఏ కారణంగానైనా మరణిస్తే...ఆ కుటుంబంపై భారం పడకుండా ఒక ఆత్మబంధువులా బీమా పాలసీలు ఉంటాయని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకే ఈ రోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఏదో ఒకరకమైన బీమా పాలసీ తీసుకునే ఉంటారు. ఏ ఐటీ కంపెనీలో పని చేసే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకి బీమా పాలసీ కలిగి ఉండడం అంత గొప్పేమీ కాదు. సాధారణంగా వారి ఆఫీస్ లోనే హెల్త్ ఇన్సూరెన్స్ అనో, గ్రూప్ ఇన్సూరెన్స్ అనో కొంత కవర్ చేస్తుంటారు. కానీ రైతుల విషయం అలా కాదు.
అసంఘటిత రంగానికి చెందిన వారు. ఎవరి పని వారు చేసుకోవడం, పంట బాగా పండితే....ఎక్కువ మద్దతు ధర వస్తే సంతోషపడడం.... లేదంటే బాధపడడం రైతన్న జీవితంలో కొత్తేమీ కాదు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వాలు వీరి గురించి ఏవో స్కీమ్ లు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎవరి అంచనాలకూ అందనంత ఎత్తులో ఒక పథకం తీసుకువచ్చింది. అదే రైతు బీమా పథకం. నిజంగానే తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన స్కీమ్ కు నాంది పలికింది ఇది 50 లక్షల మంది తెలంగాణ రైతు కుటుంబాల పాలిట అవసర సమయంలో ఆపన్న హస్తం కాబోతుంది. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు బీమా పాలసీ అంటే .....ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం అనేది ఉద్యోగులకు అంత ఎక్సైట్ మెంట్ కాకపోవచ్చు. కానీ....ఇన్సూరెన్స్ అంటే ఏమిటో తెలియని, దాని ప్రయోజనాలేంటో అవగాహన లేని రైతులు ఎంతో మంది వారి ప్రమేయం లేకుండానే ఒక అద్భుత స్కీమ్ లో భాగస్వాములైపోయారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన ఈ పథకం గురించి 50 లక్షల కుటుంబాలకు తెలియకపోవచ్చు.... వారికి ఎంత పెద్ద అండ ఈ రోజు దొరికిందో. పైసా పైసా కూడబెడుతూ, వంద రూపాయలు కూడా లక్ష రూపాయలుగా భావించే రైతులెందరో తెలంగాణలో ఉన్నారు. ఎకరా, రెండెకరాల పెట్టుబడి కోసం పాతిక వేలు కూడబెట్టుకోవడానికి శ్రమించే రైతులు తెలంగాణలో ఎందరో ఉన్నారు. ఇలాంటి వారు ఒక బీమా పాలసీ కోసం డబ్బు కట్టడానికి ముందుకు వస్తారని అనుకోవడం లేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతులందరికీ ప్రతి ఏడూ వారికి ప్రీమియం చెల్లించనుంది. జరగరానిది జరిగి రైతులు ప్రాణాలు కోల్పోతే, వారి కుటుంబాలకు సహాయంగా ఐదు లక్షల రూపాయల మొత్తం అందనుంది.
రైతు బీమా పథకం కింద 18 నుంచి 59 ఏళ్ళ లోపు రైతులు ఏ కారణంగా మరణించినా 5 లక్షల రూపాయల బీమా అందుతుంది. సహజ మరణం చోటు చేసుకున్న సందర్భాల్లోనూ ఆయా కుటుంబాలు ఆర్థికంగా కొంత సహాయన్ని ఈ పథకం వీలు కల్పిస్తుంది. ఏమైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితి కొంత మారింది. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న చేసుకున్న సందర్భంలో కుటుంబానికి అందించే సాయాన్ని 5 లక్షల రూపాయలకు పెంచారు. రుణదాతలకు అప్పులు తీర్చేందుకు అందించే మొత్తాన్ని ఒక లక్షకు పెంచారు. రైతు బీమా పథకం అమల్లోకి వచ్చినప్పటికీ ఈ పథకం కూడా కొనసాగుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. పలు రైతు సంఘాలు కూడా అదే కోరుకుంటున్నాయి.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire