జగ‌న్ నువ్వు భ‌య‌ప‌డితే నీకు నేను అండ‌గా ఉంటా

lakshman
Updated on: 24 Dec 2018 12:56 PM IST
జగ‌న్ నువ్వు భ‌య‌ప‌డితే నీకు నేను అండ‌గా ఉంటా
X

ముసుగులో గుద్దులాట లేదు. ఇక డైరెక్ట్ ఫైట్. వైసీపీ అధినేత జగన్ విసిరిన సవాలుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పనిలోపనిగా తాను కూడా బహిరంగ సవాలు విసిరారు. ఇప్పటి వరకు నేరుగా వైసీపీ, జగన్ ని టార్గెట్ చేసి మాట్లాడని పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రి మీడియా ముందుకు వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ మీద మాట్లాడారు. ఇటీవల జేఎఫ్సీ సమావేశం సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని టీడీపీ, వైసీపీలు పవన్ సూచించిన సంగతి తెలిసిందే. దాంతో స్పందించిన జగన్ తమ పార్టీకి ఉన్న ఎంపీలు అయిదుగురు మాత్రమేనని అందువల్ల ఎక్కువమంది ఎంపీలు ఉన్న టీడీపీ అవిశ్వాసం పెట్టాలని బంతిని తెలివిగా టీడీపీ కోర్టులోకి నెట్టారు. అలాగే టీడీపీ అవిశ్వాసం పెడితే తామూ మద్దతు ఇస్తామని కూడా ప్రకటించారు. అవిశ్వాసం పెట్టాలంటే 50 మంది ఎంపీల మద్దతు ఉండాలని కూడా జగన్ ముక్తాయించారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజాగా మళ్ళీ స్పందించారు. ఎన్నడూ లేని విధంగా విలేకరుల సమావేశం పెట్టి మరీ జగన్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు. జగన్ కావాలనే తప్పించుకుంటున్నారన్నట్లు ఒక్క ఎంపీ అయినా అవిశ్వాసం పెట్టవచ్చని చెప్పారు. జగన్ చెప్పినట్లు 50 మంది కాదని 80 మంది ఎంపీల మద్దతు వస్తుందని అయితే ముందు మీరు అవిశ్వాసం పెట్టాలని సవాలు విసిరారు. “మీరు అవిశ్వాసం పెట్టండి. నేను మీ వెనక ఉంటాను” అని జగన్ కు పవన్ సూచించారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజునే అవిశ్వాసం పెట్టాలని జగన్ ను డిమాండ్ చేశారు. “మార్చి నాలుగో తేదీన నేను ఢిల్లీకి వస్తాను. మీరు అవిశ్వాసం పెట్టండి. దానికి కావాల్సిన ఎంపీల మద్దతు నేను కూడగడతాను. 50 మంది కాదు 80 మంది మద్దతు తీసుకొస్తా” అని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే జగన్ దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి అని… కేంద్రంపై ఆయన తిరగబడితే తామంతా అండగా నిలుస్తామని పవన్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటనతో ఒక్కసారిగా వేడి రగిలింది. అవిశ్వాసం బంతిని టీడీపీ కోర్టులోకి నెత్తిన జగన్ తమకు ఎక్కువమంది ఎంపీలు లేరని చెప్పి పక్కన ఉండి వేడుక చూద్దాం అనుకుంటే అనూహ్యంగా రంగంలోకి వచ్చిన పవన్ మళ్ళీ బంతిని జగన్ కోర్టులోకి గిరాటేసి రాజకీయాన్ని రసకందాయంలో పడేసారు.
ఇప్పుడు జగన్ ఎలా స్పందిస్తారన్నది తేలాల్సి ఉంది. పవన్ డిమాండ్ చేసినట్లు తానే అవిశ్వాసం పెడతారా లేక ఎదురుదాడికి దిగి మాటలతో మాయ చేస్తారా అన్నది తేలాలి. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో జగన్ ఎక్కడ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వాన్ని… ప్రధాని మోదీని పల్లెత్తు మాట అనలేదు. మరి ఇప్పుడు అవిశ్వాసం పెట్టేందుకు జగన్ సిద్ధపడితే ఒకే. లేకుంటే రాజకీయంగా మళ్ళీ తప్పటడుగు వేసినట్లే.

lakshman

lakshman

Next Story