ఏమిటీ ఉపద్రవం.... ప్రకృతి పగపట్టిందా?

santosh
Updated on: 24 Dec 2018 1:23 PM IST
ఏమిటీ ఉపద్రవం.... ప్రకృతి పగపట్టిందా?
X

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు... ఆదిలాబాద్ నుంచి పాలమూరు వరకు... ఏమిటి ఈ ఆకాశంలో ఉపద్రవం, ఎక్కడి నుండి వస్తున్నాయి ప్రచండ గాలులు. ఎక్కడి నుండి ఎగసిపడుతున్నాయి అగ్ని గోళాలు, ఎందుకింత విపత్తు... ప్రకృతి పగ పట్టిందా..?

ఉదయం వరకు మండే ఎండలు, మధ్యాహ్నం నుంచి వానజల్లులు. నిన్నటి వరకూ అక్కడ వానలు, ఇక్కడ ఎండలు. ఇలా ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో విభిన్నవాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. ప్రాంతాలని బట్టి ఎండ, వేడి వేరువేరుగా ఉంటుంది. వాతావరణం.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. పల్లెటూళ్లలో చల్లగా ఉంటుంది. అదే నగరాల్లో ఎక్కువ వేడిగా వుంటుంది. ప్రాంతాల్ని బట్టి ఎండ వేడి వేరువేరుగా ఉంటుంది.

నగరాల్లో భవనాలు, ఉపయోగించే యంత్రాలు బోలెడంత వేడిని పుట్టిస్తాయి. భవనాలు, ఎత్తయిన నిర్మాణాలు ఎక్కువగా వేడిని స్టాక్ చేసేస్తాయట. పైగా హరితం తక్కువగా ఉండడం, కాంక్రీట్‌ జింగ్‌లా మారిపోవడం, భవనాలు ఎక్కువగా ఉంటడంతో వేడి కూడా ఎక్కువవుతుందని వాతావరణశాఖ నిపుణులు చెప్తున్నారు. అందుకే మొక్కలు తక్కువగా, భవనాలు ఎక్కువగా ఉండే నగరాల్లో వేడి ఎక్కువవుతుంది.

టెక్నాలజీ యుగంలో... మనిషి జీవితంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక రకంగా ఇవి ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ వాడకం, నీటి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం, వాతావరణ కాలుష్యం... ఇతర కారణాలన్నీ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసి అకాల వాతావరణానికి కారణాలుగా మారుతున్నాయి. పెను మార్పులకు తావిస్తున్నాయి. దీంతో ఎండకాలంలో వర్షాలు, శీతాకాంలో ఎండలు... వానాకాలంలో వర్షాలు లేక కరవు కాటకాలకు కారణభూతాలుగా మారిపోతున్నాయి.

గత నాలుగు రోజులుగా... పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. మండే ఎండల్లో అకాల వర్షాలు కురవడానికి కారణం లేకపోలేదు. ఎండలకి భూమి విపరీతంగా వేడెక్కుతుంది. దానికి దగ్గరగా ఉన్న గాలి... మిగిలిన గాలి కన్నా ఎక్కువగా వేడెక్కుతుంది. ఇలా గాలి వేడిగా తయారుకావడంతో అది తేలికై వాతావరణంలో పైకి వెళుతుంది. ఇలా భూమి సమీపంలోని గాలి వాతావరణంలో పైపైకి వెళ్లిపోవడంతో భూమిపై అల్పపీడనం ఏర్పడుతుంది. అంటే గాలి తక్కువై పోయి... పైకి వెళుతున్న గాలి వ్యాకోచం చెంది చల్లబడుతుంది. నీటి ఆవిరి... తేమతో కూడిన గాలి ఈ విధంగా చల్లబడటంతో ఒక దశలో అది ద్రవీభవన స్థాయిని చేరుకుంటుంది. అంటే గాలిలోని తేమ చల్లదనానికి నీటి బిందువులుగా ద్రవీకరణం చెందుతుంది. ఈ ప్రక్రియ జరుగుతూ ఉండటం వల్ల మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాలు పెరుగుతూ ఓ దశలో వర్షంగా కురుస్తాయి.

santosh

santosh

Next Story