భక్తులకు చుక్కలు చూపిస్తోన్న టీటీడీ

admin
Updated on: 24 Dec 2018 12:21 PM IST

వెంకన్న దర్శనం కోసం తిరుమల వచ్చిన భక్తులకు టీటీడీ చుక్కలు చూపిస్తోంది. సంస్కరణల పేరుతో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు భక్తులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. దేశ నలుమూలల నుంచి తరలివస్తోన్న భక్తులకు వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ముఖ్యంగా అద్దె గదుల కేటాయింపు తీవ్ర గందరగోళంగా మారింది. టీటీడీ నిర్ణయాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

టీటీడీ చేపట్టిన సంస్కరణలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. ముఖ్యంగా అద్దె గదుల కేటాయింపు ప్రక్రియ పెద్ద తలనొప్పిగా మారింది. అద్దె గదులు కావాల్సిన భక్తులు మొదటి దశలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి మొబైల్‌కి రిజిస్ట్రేషన్‌ మెసేజ్ వచ్చాక రూమ్‌ కేటాయించేవరకూ బయట వేచిచూడాలి. ఇక రిజిస్ట్రేషన్‌ కోసమైతే భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిందే. ఎందుకంటే రోజుకి రెండుసార్లు మాత్రమే అంటే ఉదయం 6గంటలకోసారి మధ్యాహ్నం రెండు గంటలకోసారి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఒకవేళ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా రూమ్‌ కచ్చితంగా లభిస్తుందో లేదో తెలియడం లేదంటున్నారు భక్తులు.

రూమ్‌ కేటాయిస్తే అరగంటలోపే తీసుకోవాలి లేదంటే కేన్సల్‌ అవుతుంది. ఇక ఫోన్‌ లేకపోయినా, ఫోన్లో ఛార్జింగ్‌ అయిపోయినా, సిగ్నల్స్‌ లేకపోయినా అంతే సంగతులు అద్దెగది కథ కంచికి చేరినట్లే అప్పటివరకూ పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే. మళ్లీ మొదట్నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకుని పడిగాపులు పడాల్సిందే.

admin

admin

Next Story