
Repo Rate: రెపో రేటుతో పాటు సీఆర్ఆర్ తగ్గింపు .. బ్యాంకులకు రూ.2.50 లక్షల కోట్ల లిక్విడిటీ!
Repo Rate: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో ఒక ముఖ్యమైన నిర్ణయం వెలువడింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో పాటు, మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు.
Repo Rate: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో ఒక ముఖ్యమైన నిర్ణయం వెలువడింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో పాటు, మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అదే సీఆర్ఆర్ (CRR) లేదా క్యాష్ రిజర్వ్ రేషియోను తగ్గించడం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. సీఆర్ఆర్ రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించారు. ప్రస్తుతం 4శాతం ఉన్న సీఆర్ఆర్ను 3శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.
లక్షల కోట్లలో డబ్బు అందుబాటులోకి ఎలా వస్తుంది?
ఆర్బీఐ గవర్నర్ చెప్పిన ప్రకారం.. 2025 సెప్టెంబర్ నుంచి మొదలై, నాలుగు దశల్లో ఒక్కోసారి 25 బేసిస్ పాయింట్ల చొప్పున సీఆర్ఆర్ను తగ్గిస్తారు. ఈ నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో భారత బ్యాంకింగ్ వ్యవస్థకు రూ. 2.50 లక్షల కోట్ల లిక్విడిటీ లభిస్తుంది. లిక్విడిటీ పెరగడం అంటే మార్కెట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుందని అర్థం. అంటే, బ్యాంకుల వద్ద రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఉంటాయి. దీని వల్ల బ్యాంకులు ప్రజలకు, వ్యాపారాలకు ఎక్కువ రుణాలు ఇవ్వగలుగుతాయి.
సీఆర్ఆర్ (CRR) అంటే ఏమిటి?
సీఆర్ఆర్ (CRR) లేదా క్యాష్ రిజర్వ్ రేషియో అంటే.. బ్యాంకులు తమ వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లలో (ప్రజలు బ్యాంకుల్లో జమ చేసిన డబ్బులో) ఒక నిర్దిష్ట భాగాన్ని ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాలనే నిబంధన. ఉదాహరణకు: ఒక బ్యాంకు తన కస్టమర్ల నుండి మొత్తం రూ. 1,000 కోట్లు డిపాజిట్ల రూపంలో పొందింది అనుకుందాం. సీఆర్ఆర్ 4% ఉందనుకుంటే, ఆ బ్యాంకు రూ. 40 కోట్లు (1,000 కోట్లలో 4%) ఆర్బీఐ వద్ద ఉంచాలి. ఈ మొత్తాన్ని సీఆర్ఆర్ అంటారు. ఈ డబ్బును బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఉపయోగించలేవు. సీఆర్ఆర్ అనేది బ్యాంకింగ్ వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ ఉపయోగించే ముఖ్యమైన మార్గాలలో ఒకటి. రెపో రేటు, సీఆర్ఆర్ వంటి విధానాలను ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని (Inflation) నియంత్రించడానికి ఉపయోగిస్తుంది.
సీఆర్ఆర్ తగ్గింపుతో డబ్బు ప్రవాహం ఎలా పెరుగుతుంది?
క్యాష్ రిజర్వ్ రేషియోను 4% నుండి 3%కి తగ్గించారు. ఈ తగ్గింపు ప్రక్రియ సెప్టెంబర్ 6, అక్టోబర్ 4, నవంబర్ 1, నవంబర్ 29 తేదీల్లో ఒక్కోసారి 25 బేసిస్ పాయింట్ల చొప్పున నాలుగు సార్లు జరుగుతుంది. దీని వల్ల దశలవారీగా బ్యాంకుల వద్ద డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన డబ్బు మొత్తం తగ్గుతుంది కాబట్టి, బ్యాంకుల వద్ద రుణాలు ఇవ్వడానికి ఎక్కువ డబ్బు అందుబాటులో ఉంటుంది.
దీనితో బ్యాంకులు ప్రజలకు, వ్యాపారాలకు మరిన్ని రుణాలు ఇవ్వగలవు. రెపో రేటును కూడా తగ్గించడం వల్ల రుణాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆర్బీఐ సీఆర్ఆర్ను తగ్గించడం సరైన నిర్ణయం అని విశ్లేషకులు చెబుతున్నారు. రుణాలు పెరిగినప్పుడు ప్రజల ఖర్చులు, వినియోగం పెరుగుతుంది. ఇది ఆర్థిక వృద్ధికి ఊపందుకోవడానికి సహాయపడుతుందని చెప్పవచ్చు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




