PM SVANidhi Extended to 2030.. కేంద్రం నుంచి రూ. 90,000 రుణం! చిరు వ్యాపారులకు మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

చిరు వ్యాపారుల కోసం కేంద్రం 'పీఎం స్వనిధి' పథకాన్ని 2030 వరకు పొడిగించింది. ఆధార్ కార్డు ఉంటే చాలు ఎటువంటి గ్యారెంటీ లేకుండా రూ. 90,000 వరకు రుణం పొందవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

santhoshi
Published on: 19 Jan 2026 3:19 PM IST
PM SVANidhi Extended to 2030.. కేంద్రం నుంచి రూ. 90,000 రుణం! చిరు వ్యాపారులకు మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్
X

సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనుకుంటున్నారా? పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. వీధి వ్యాపారులు, చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన 'పీఎం స్వనిధి' (PM SVANidhi) పథకాన్ని ప్రధాని మోడీ ఏకంగా 2030 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ పథకం ద్వారా ఎటువంటి గ్యారెంటీ (తాకట్టు) లేకుండానే మీరు ఆర్థిక సాయం పొందవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

మూడు విడతల్లో రూ. 90,000 వరకు రుణం

ఈ పథకం కింద అర్హులైన వ్యాపారులకు మూడు దశల్లో రుణ సదుపాయం కల్పిస్తారు:

  1. మొదటి విడత: రూ. 15,000 రుణం లభిస్తుంది.
  2. రెండో విడత: మొదటి విడత రుణాన్ని సకాలంలో చెల్లిస్తే, రూ. 25,000 వరకు రుణం పొందవచ్చు.
  3. మూడో విడత: రెండో విడత క్లియర్ చేశాక, గరిష్టంగా రూ. 50,000 వరకు రుణం ఇస్తారు.

మొత్తంగా ఒకే వ్యక్తి రూ. 90,000 వరకు సహాయం పొంది తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేయాలి? కావాల్సిన పత్రాలు ఏవి?

ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. ఎలాంటి పేపర్ వర్క్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

కావాల్సినవి: కేవలం మీ ఆధార్ కార్డ్, దానికి లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఉంటే సరిపోతుంది.

ఎక్కడ: ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో లేదా ఆన్‌లైన్ పీఎం స్వనిధి పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

చెల్లింపు: తీసుకున్న రుణాన్ని సులభమైన ఈఎంఐల (EMI) రూపంలో తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంది.

డిజిటల్ వ్యాపారం.. అదనపు లాభాలు!

వ్యాపారులను డిజిటల్ లావాదేవీల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని ఆఫర్లు ఇస్తోంది:

క్యాష్‌బ్యాక్: యూపీఐ (UPI) ద్వారా లావాదేవీలు జరిపితే ప్రత్యేక క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

రూపే క్రెడిట్ కార్డ్: వీధి వ్యాపారులకు యూపీఐతో లింక్ అయిన రూపే క్రెడిట్ కార్డులను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

లక్ష్యం దిశగా ప్రభుత్వం

2025 డిసెంబర్ నాటికే సుమారు 69.66 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 15,191 కోట్లకు పైగా నిధులను పంపిణీ చేసింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 1.15 కోట్ల మంది చిరు వ్యాపారులకు అండగా నిలవడమే కేంద్రం ప్రధాన లక్ష్యం.

santhoshi

santhoshi

Next Story