
Egg Price Drop
మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీనివల్ల పౌల్ట్రీ రంగానికి రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది, గుడ్డు ధర రూ.3.30కి పడిపోయింది.
Egg Price Drop : మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారతీయ వంటగదిపై, ముఖ్యంగా పౌల్ట్రీ రంగంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు ముదరడంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలు, సముద్ర రవాణా నిలిచిపోవడంతో భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే కోడిగుడ్ల ఎగుమతులు పూర్తిగా స్తంభించిపోయాయి. ఫలితంగా దేశీయ పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు రూ.5 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లుతోంది.
ఎగుమతులకు బ్రేక్.. నిలిచిపోయిన కోట్లాది గుడ్లు
భారతదేశం నుంచి ముఖ్యంగా తమిళనాడులోని నామక్కల్, తెలుగు రాష్ట్రాల నుంచి ఒమన్, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ వంటి మధ్యప్రాచ్య దేశాలకు ప్రతిరోజూ సుమారు కోటి (10 మిలియన్) గుడ్లు ఎగుమతి అవుతాయి. అయితే యుద్ధం కారణంగా పోర్టులు, ఎయిర్పోర్టులు మూసివేయడంతో రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. దాదాపు 1000కి పైగా కంటైనర్ల గుడ్లు రేవుల్లోనే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇవి త్వరగా పాడయ్యే వస్తువులు కావడంతో అటు ఎగుమతిదారులు, ఇటు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ధరల పతనం.. కుదేలవుతున్న పౌల్ట్రీ రైతు
ఎగుమతులు ఆగిపోవడం వల్ల ఆ గుడ్లన్నీ దేశీయ మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మార్కెట్లో గుడ్ల నిల్వలు పెరిగిపోయి ధరలు దారుణంగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) ప్రకారం ప్రస్తుతం గుడ్డు ధర రూ.4.50గా ఉండాల్సి ఉండగా.. బహిరంగ మార్కెట్లో ఇది రూ.3.30 నుంచి రూ.3.50 వరకు పడిపోయింది. వాస్తవానికి ఒక గుడ్డు ఉత్పత్తి చేయడానికి రైతుకు రూ.4.50 వరకు ఖర్చవుతోంది. ఈ లెక్కన ప్రతి గుడ్డుపై రైతు రూపాయికి పైగా నష్టపోవాల్సి వస్తోంది. కేవలం నామక్కల్ మార్కెట్ నుంచే దేశం మొత్తం ఎగుమతుల్లో 95 శాతం వాటా ఉండటంతో అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
మరిన్ని కష్టాలు.. ఎల్ఎన్జీ సరఫరాపై ప్రభావం
యుద్ధం ప్రభావం కేవలం ఎగుమతులపైనే కాకుండా.. ఉత్పత్తిపై కూడా పడుతోంది. ఖతార్ నుంచి వచ్చే ఎల్ఎన్జీ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఎరువుల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా పౌల్ట్రీకి అవసరమైన దాణా ధరలు పెరగడానికి కారణమవుతోంది. అటు దాణా ఖర్చులు పెరగడం, ఇటు గుడ్ల ధరలు తగ్గడంతో పౌల్ట్రీ రైతులు కోలుకోలేని దెబ్బ తింటున్నారు. దీనికి తోడు వేసవి తాపం, రంజాన్ వంటి కారణాల వల్ల కూడా దేశీయ వినియోగం తగ్గిందని నిపుణులు చెబుతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




