West Asia crisis: యుద్ధం వేళ భారత్ కీలక నిర్ణయం.. పెట్రోల్ ధరలు పెరగకుండా ప్రయత్నాలు

West Asia Crisis: మధ్య ప్రాచ్యంలో యుద్ధ నేపథ్యంలో భారత్ ఆయిల్ కొనుగోళ్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది
x

West Asia Crisis

Highlights

West Asia crisis: ఇరాన్ - ఇజ్రాయేల్ యుద్ధం నేపథ్యంలో ముడి చమురు కొరతను ఎదుర్కోవడానికి భారత్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు బ్లూమ్ బెర్గ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి

West Asia crisis: ఇరాన్ - ఇజ్రాయేల్ యుద్ధం నేపథ్యంలో ఆయిల్ సప్లై చైన్ దెబ్బతింది. దీంతో చమురు ధరలు పరిగిపోతున్నాయి. ఈ ప్రభావంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయే ఛాన్స్ ఉంది. పెట్రోల్ ధరలు పెరిగిపోతే ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బ పడుతుంది. దీంతో భారత్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చమురు కొనుగోళ్ల కోసం భారత్ మరోసారి రష్యా వైపు మొగ్గు చూపింది. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశం తన చమురు అవసరాలను తీర్చడానికి రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను పెంచాలని యోచిస్తోంది.

గత కొన్ని రోజులుగా హార్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాలు దాదాపుగా నిలిచిపోయాయి. దీనితో ప్రభుత్వ నిర్వహణలోని ఆయిల్ రిఫైనరీలు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి ఢిల్లీలో అత్యవసర సమావేశం నిర్వహించారు.

West Asia crisis: జాతీయ మీడియా రిపోర్ట్స్ ప్రకారం భారతదేశం ప్రస్తుతం హిందూ మహాసముద్రం సమీపంలో లేదా ఆసియా జలాల్లో ఉన్న రష్యన్ చమురు సరుకులను కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తోంది. డేటా ప్రకారం, సుమారు 9.5 మిలియన్ బారెల్స్ రష్యన్ ముడి చమురు ప్రస్తుతం ట్యాంకర్లలో లోడ్ అయి ఆసియా దేశాల చుట్టూ వేచి ఉంది. సరఫరా కొరత ఏర్పడితే, భారతదేశం ఈ ట్యాంకర్లను త్వరగా యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంది. ఇది రవాణా సమయం అలాగే ఖర్చులు రెండింటినీ తగ్గిస్తుంది.

రష్యా నుంచే ఎందుకు?

తక్కువ ధర : రష్యా భారతదేశానికి చమురును బెంచ్‌మార్క్ ధరలకు తగ్గింపుతో అందిస్తోంది.

సప్లై సేఫ్టీ : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరాలకు అంతరాయం కలిగించినప్పుడు, రష్యా నుంచి సురక్షితంగా ఆయిల్ సరఫరా ఉంటుంది.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం: తక్కువ ధరలకు చమురు దొరకడం కారణంగా, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది.

ఫిబ్రవరిలో రష్యా నుంచి తగ్గిన కొనుగోళ్లు..

West Asia crisis: అమెరికా ఒత్తిడి, కఠిన ఆంక్షల కారణంగా భారత్ కొన్ని నెలలుగా రష్యా నుండి చమురు కొనుగోళ్లను తగ్గించింది. ఫిబ్రవరిలో, భారతదేశం రష్యా నుండి రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే కొనుగోలు చేసింది. ఇది సెప్టెంబర్ 2022 తర్వాత అత్యల్ప స్థాయి. అయితే, ఇప్పుడు, మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితి -ప్రపంచ మార్కెట్లో ముడి చమురు కొరత దృష్ట్యా, భారతదేశం తన వ్యూహంలో మార్పును సూచిస్తోంది.

అమెరికా అదనపు సుంకాల ఒత్తిడి..

గత నెలలో, భారతదేశం - అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగాయి. ఇందులో భారతదేశంపై సుంకాలను 50% నుండి 18%కి తగ్గించడం కూడా ఉంది. ఈ 50% సుంకంలో సగం రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలకు విధించే ఫైన్.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25% సుంకాన్ని ఎత్తివేశారు. రష్యా నుండి చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారతదేశం అంగీకరించినందున తాను ఈ మినహాయింపును మంజూరు చేశానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, భారతదేశం మాత్రం తాను అలా అంగీకరించినట్టు ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. అదే విధంగా చమురు కొనుగోలు విషయంలో భారతదేశం తన వైఖరిని మార్చుకోవడానికి ఎటువంటి కారణం లేదని రష్యా కూడా పేర్కొంది.

రష్యా చమురు కొనుగోలుదారుల్లో మూడో స్థానంలో భారత్..

రిపోర్ట్స్ ప్రకారం డిసెంబర్ 2025లో, భారతదేశం రష్యా చమురు కొనుగోళ్లలో మూడవ స్థానంలో నిలిచింది. డిసెంబర్‌లో భారతదేశం రష్యా నుండి 2.3 బిలియన్ యూరోలు (సుమారు ₹23,000 కోట్లు) చమురును కొనుగోలు చేసింది. నవంబర్‌లో, భారతదేశం 3.3 బిలియన్ యూరోలు (₹34,700 కోట్లు) విలువైన చమురును కొనుగోలు చేసింది.

డిసెంబర్‌లో రష్యా నుండి 6 బిలియన్ యూరోలు (సుమారు €63,100 కోట్లు) చమురును కొనుగోలు చేస్తూ చైనా అతిపెద్ద కొనుగోలుదారుగా కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories