
Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నేడు డిసెంబర్ 31వ తేదీ ధరలు ఇవే..!!
Gold Rate Today: డిసెంబర్ 31, బుధవారం నాటి బంగారం.. వెండి ధరలు మళ్లీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో నేటి ధరలను పరిశీలిస్తే బంగారం నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగినట్లు కనిపిస్తోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,40,238గా నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,28,551గా ఉంది. అదే సమయంలో ఒక కిలో వెండి ధర రూ.2,53,145గా ట్రేడ్ అవుతోంది.
ఇటీవల బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఒకే రోజులో భారీగా పడిపోవడం, వెంటనే తిరిగి కోలుకోవడం వంటి పరిణామాలు వరుసగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో ఒక్క ఔన్స్ బంగారం ధర సుమారు 4,364 డాలర్లుగా ఉంది. రెండు రోజుల క్రితం ఇదే ధర దాదాపు 4,500 డాలర్ల స్థాయిలో ఉండటం గమనార్హం. అంటే తక్కువ సమయంలోనే దాదాపు 200 డాలర్ల పతనం నమోదైంది.
బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా తగ్గడానికి ప్రధాన కారణంగా ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ను నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల బంగారం భారీగా లాభాలు ఇచ్చిన నేపథ్యంలో చాలామంది పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకుని పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వల్ల ధరలపై ఒత్తిడి పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సంవత్సర ఆరంభం నుంచి చూస్తే బంగారం ధరలు మొత్తంగా భారీగా పెరిగిన సంగతి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక దశలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1.45 లక్షల వరకు చేరడం మార్కెట్లో సంచలనం సృష్టించింది.
బంగారం ధరలు ఈ స్థాయికి చేరడానికి ప్రధాన కారణంగా డాలర్ విలువ బలహీనపడటాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ బలహీనపడే కొద్దీ పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో బంగారం మరోసారి ‘సేఫ్ హెవెన్’ ఆస్తిగా తన స్థానాన్ని బలపరుచుకున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరోవైపు వెండి ధరలు కూడా ఇటీవల భారీ మార్పులను ఎదుర్కొన్నాయి. డిసెంబర్ 29న వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలినట్టు కనిపించాయి. కేవలం కొన్ని నిమిషాల్లోనే దాదాపు 15 శాతం వరకు పతనం నమోదైంది. అయితే ఇది తాత్కాలిక పరిణామమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వెండి ధర మళ్లీ రికవరీ బాట పట్టింది.
వెండి ధరలు తిరిగి పెరగడానికి ప్రధాన కారణంగా పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ కొనసాగుతుండటాన్ని విశ్లేషకులు సూచిస్తున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లలోని అనిశ్చిత పరిస్థితులు కూడా వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
మొత్తంగా చూస్తే 2025 సంవత్సరం బంగారం, వెండి పెట్టుబడిదారులకు అద్భుతమైన లాభాలను అందించింది. ఈ ఏడాది బంగారం దాదాపు 70 శాతం వరకు రిటర్న్ ఇచ్చినట్లుగా అంచనా వేయగా, వెండి అయితే ఏకంగా 160 శాతం కంటే ఎక్కువ లాభాలను అందించింది. ఇక కొత్త ఏడాదిలో ఈ రెండు లోహాల ధరలు ఏ దిశగా సాగుతాయోనన్నది పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




